కలిసిపోయిన భూమా-శిల్పా: అదీ జగన్.. భూమా తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: కర్నూలు జిల్లాలో ఉప్పు - నిప్పుగా ఉన్న భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరుల మధ్య సయోధ్య కుదిరింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తామిద్దరం కలిసి పని చేస్తామని చెప్పారు.
తాము ఇరువురం కలిసి కర్నూలు జిల్లాలో పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పని చేస్తామని చెప్పారు. అదే సమయంలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. మిగతా వైసిపి ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పారు.
శిల్పా సోదరులు మాట్లాడుతూ.. తమకు భూమాతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికపై సమన్వయంతో వెళ్తామన్నారు. విభేదాలు సమసిపోయాయని, అభివృద్ధి పైన దృష్టి సారిస్తామన్నారు.
వైసిపిలో మిగిలిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు త్వరలోనే టిడిపిలో చేరుతారని చెప్పారు. త్వరలోనే వైసిపి పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. పార్టీపై జగన్ పట్టును కోల్పోయారన్నారు. తమకు చంద్రబాబు మాట వేదవాక్కు అన్నారు. ఆయన చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు.
కర్నూలు జిల్లాలో టిడిపి నేతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అభివృద్ధి పథంలో జిల్లా దూసుకెళుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సమక్షంలో విభేదాలు సమసిపోయాయని చెప్పారు.
వైసిపి కూలిపోయే చెట్టు: భూమా
వైసిపి కూలిపోయే చెట్టు అని, దాని నీడలో సేద తీరాలని ఎవరూ అనుకోరని, అనుకుంటే ప్రమాదమని భూమా నాగిరెడ్డి అన్నారు. రాజకీయ నేతలు తమకి ఎక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతారో అక్కడికే వెళ్తారని, తాము కూడా అంతే అన్నారు.
అధికారం, డబ్బు, పదవులకి ఆశపడి వచ్చామనే ఆరోపణలలో నిజం లేదని, అదే నిజమైతే ప్రతిపక్షంలో ఉన్న వైసిపిలోకి ఒకప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు చేరారని ప్రశ్నించారు. జగన్ చేయబోయే దీక్ష గురించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టీవీలలో చూసే తెలుసుకున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి తెలుస్తోందన్నారు.
కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని జగన్ పదేపదే చంద్రబాబు నాయుడిని కోరుతుంటారని, కానీ తెగతెంపులు చేసుకొంటే ఏమవుతుందో అందరికీ తెలుసునని చెప్పారు. అప్పుడు డిల్లీలో మన మాట వినేవాళ్ళే ఉండరన్నారు. అప్పుడు రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్నారు.