భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చెల్లెలు??
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డలో రాజకీయం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం జరిగినప్పుడు కూడా చంద్రబాబునాయుడు ఆళ్లగడ్డ ఇన్ ఛార్జిని ప్రకటించలేదు. అలా అని అఖిలప్రియను పనిచేసుకోమని చెప్పలేదు. రానున్న ఎన్నికల్లో అఖిలప్రియకు సీటుంటుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వివాదాస్పద నిర్ణయాలతో తరుచుగా వార్తలో..
తమ జీవితకాలంలో భూమా నాగిరెడ్డికానీ, శోభానాగిరెడ్డికానీ మంత్రులు కాలేకపోయారు. కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రి పదవిని దక్కించుకున్న అఖిల ప్రియ ఆ తర్వాత వివాదాస్పద నిర్ణయాలతో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాతే ఈ చిక్కులన్నీ వస్తున్నాయని సన్నిహితులు చెబుతుంటారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన టీడీపీ నాయకులెవరంటే అఖిలప్రియ అని శ్రేణులు ఠక్కున చెబుతారు.
సీటివ్వడానికి వెనకాడుతున్న చంద్రబాబు
రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకానీ, లోకేష్ కానీ ఆమెకు సీటివ్వడానికి వెనకాడుతున్నారని పార్టీవర్గాలంటున్నాయి. తరుచుగా ఎదుర్కొంటున్న వివాదాలతో ఆమె పార్టీపై దృష్టిపెట్టడం తగ్గిపోయిందని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నంద్యాలలో కూడా అఖిలప్రియ తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి విషయంలో అడ్డు తగులుతున్నారు.
అంతేకాకుండా భూమాతో మొదటి నుంచి రాజకీయాల్లో కలిసి నడిచినవారిని కూడా ఆమె దూరం చేసుకున్నారంటున్నారు. తన సోదరి మౌనికారెడ్డితో అఖిలప్రియకు తీవ్ర విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆళ్లగడ్డ వచ్చిన మౌనికారెడ్డి తన సోదరిని కనీసం పలకరించలేదని, ఇంటికి కూడా వెళ్లలేదని తెలుస్తోంది.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం అక్కడ కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే మౌనికారెడ్డి ఈసారి మౌనం దాల్చారు. తన తల్లి శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో ఇద్దరు సోదరీమణులు వేర్వేరుగా పాల్గొన్నారు.
మనోజ్ ను వివాహం చేసుకోబోతున్న మౌనికారెడ్డి
మంచు మనోజ్ తో కలిసివుంటున్న మౌనికారెడ్డి త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతున్నారు. మనోజ్ కు కూడా రెండో వివాహమే. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మౌనికారెడ్డి టీడీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు.
మోహన్ బాబు కూడా ఇటీవలి కాలంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. అఖిలప్రియను తప్పించి మౌనికారెడ్డి సీటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే భూమా కుటుంబం టీడీపీతోనే ఉంది అనే సంకేతాలను పంపించడానికి చంద్రబాబు మౌనికారెడ్డికి సీటిచ్చే అవకాశం ఉందంటుననారు.
మనోజ్ కు కూడా రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. చిత్తూరు జిల్లాల నుంచి పోటీచేస్తానని గతంలో ఒకసారి ప్రకటించారు. మౌనికారెడ్డి వస్తే అక్కాచెల్లెళ్ల మధ్య ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కనుంది. మరి చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చే విషయంలో ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి.!!