బాబుతో భూమా చివరి మాటలు.. చివరి ఫోటో!: భార్య పక్కన్నే శాశ్వత విశ్రాంతి..
సీఎంతో సమావేశానికి తన వెంటబెట్టుకుని వెళ్లిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను పేరుపేరునా చంద్రబాబుకు పరిచయం చేశారు. సమావేశానంతరం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆదే భూమాకు చివరి ఫోటో కావడం గమన
ఆళ్లగడ్డ: ప్రేమ వివాహంతో ఒక్కటైన శోభా-భూమా నాగిరెడ్డి దంపతులు రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడేళ్ల వ్యవధిలోనే ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టడం కుటుంబ సభ్యులతో పాటు వారిని నమ్ముకున్న కార్యకర్తలను తీవ్ర శోకంలోకి నెట్టింది.
ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినా.. ఫ్యాక్షన్ వ్యతిరేకంగా ఆయన చేసిన పలు కార్యక్రమాలు జనానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. ఆదివారం నాడు తీవ్ర గుండెపోటుతో ఆయన హఠాన్మరణానికి గురవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆయన రాజకీయ గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
శోభా పక్కన్నే భూమా:
నేడు జరగబోయే భూమా అంత్యక్రియలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరపనున్న ఈ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖుుల హాజరుకానున్నారు.
కాగా, మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భూమా సతీమణి శోభా నాగిరెడ్డికి అంత్యక్రియలు నిర్వహించిన చోటే ఆయనకు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆళ్లగడ్డలోని శోభా ఘాట్ పక్కన్నే భూమాకు చివరి వీడ్కోలు పలకనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
శోభా ఘాట్ పేరు మార్పు:
శోభా ఘాట్ పక్కన్నే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనుండటంతో.. ఇకనుంచి ఆ ఘాట్ కు భూమా ఘాట్ గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఘాట్ చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, నేటి మధ్యాహ్నం 3 గంటలకు భూమా మృతదేహాన్ని ఊరేగింపుగా శోభా ఘాట్ వద్దకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఆ మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబుతో భూమా చివరి మాటలు:
ఆదివారం నాడు హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డి.. అంతకుముందు శనివారం రోజు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను వెంటబెట్టుకుని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
ఈ సందర్బంగా నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో ఆయన చర్చించారు. గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశానంతరం చంద్రబాబంటే తనకెంతో గౌరవమని, సమస్య ఏదైనా ఆయన సానుకూలంగా స్పందిస్తారని భూమా అన్నారు.
నంద్యాల నియోజకవర్గంలో 3 వేల మందికి వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగానే.. చంద్రబాబు నిధులు మంజూరు చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు.
విభేదాలను పక్కనబెట్టి:
పార్టీ మేలు కోసం రాజకీయ విభేదాలను సైతం పక్కనబెట్టారు భూమా.తనకు, శిల్పా చక్రపాణిరెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని, అందుకు తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు.
చివరి ఫోటో అదే:
సీఎంతో సమావేశానికి తన వెంటబెట్టుకుని వెళ్లిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను పేరుపేరునా చంద్రబాబుకు పరిచయం చేశారు. సమావేశానంతరం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆదే భూమాకు చివరి ఫోటో కావడం గమనార్హం.