రాజకీయ అనుభవం లేని జగన్ వద్ద పనిచేయలేకే.. టీడీపీలోకి : భూమా
కర్నూలు : రాజకీయ అనుభవం లేని జగన్ దగ్గర పనిచేయడం కంటే టీడీపీలో పనిచేయడమే ఉత్తమమనే ఉద్దేశ్యంతో అధికార పార్టీలో చేరినట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా పేరిట జగన్ చేస్తోన్న కార్యక్రమాలను భూమా తప్పుబట్టారు. ఏపీ ప్రజలను మభ్య పెట్టేందుకే జగన్ ప్రత్యేక హోదా గళమెత్తుకున్నారని ఆరోపించారు.
నంద్యాలలో టీడీపీ జన చైతన్య యాత్రను ప్రారంభించిన సందర్బంగా భూమా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా జగన్ పై పలు విమర్శలు గుప్పిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు భూమా. నంద్యాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు భారీగా నిధులు మంజూరు చేశారని, ఏపీ ప్రజల సంక్షేమం సీఎం ఎంతగానో శ్రమిస్తున్నారని తెలిపారు.
ఇక ప్రత్యేక హోదాపై జగన్ చేస్తోన్న పోరాటాన్ని తప్పుబడుతూ.. అదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించారు భూమా. హోదాపై జగన్ కు చిత్తశుద్ది ఉంటే ఇంతవరకు ఒక్క జాతీయ నేతను కూడా ఎందుకు కలవలేకపోయారని ప్రశ్నించారు.