అసెంబ్లీ: భూమన టార్గెట్ బాబు, టిడిపి ఎదురుదాడి

రాష్ట్ర విభజన బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. సభలో సమైక్య తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీని ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూస్తున్నారని ఆయన అన్నారు. తమకు ప్రజలు అధికారం ఇస్తారనే భయంతో తమపై విపరీతమైన ఆలోచనలు చేస్తున్నారని ఆయన అన్నారు. విభజనకు సహకరిస్తున్నామంటూ తమపై దుర్మర్గంగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. లోపలా బయటా తమది ఒకే మాట అని ఆయన అన్నారు.
రాష్ట్ర సమైక్యతను కోరుకున్న మొదటి నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు. రాష్ట్రం మేలు కోసం తాము సమైక్యతను కోరుతున్నామని ఆయన అన్నారు. విభజన వల్ల తెలంగాణకు అన్యాయం జరగదని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో సమైక్య ప్రకటన చేయించాలని ఆయన అన్నారు. తెలుగుదేశం రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తోందని భూమన చేసిన ప్రకటనపై తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని భూమన అన్నారు. తాను పార్టీ పేరు కూడా ఎత్తలేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేశారంటూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. రోశయ్య కమిటీ వేసినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలను ఆయన వివరించారు. రోశయ్య కమిటీ అధ్యయనం చేయాల్సిన అంశాలేమిటో ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అభాండాలు వేసి తక్కువ చేసి చూపించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
కొత్త పార్టీ కోసం వెతుకున్నవాళ్లు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గోవిందా అంటూ భూమన వ్యాఖ్యానించారు. జగన్పై అభాండాలు వేయడానికే తెలుగుదేశం పార్టీ సమయమంతా సరిపోతుందని ఆయన అన్నారు.
జగన్ కాదా..
భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యుడు రావు చంద్రశేఖర రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని కోరింది జగన్ కాదా అని ఆయన అడిగారు. తెలంగాణ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని వైయస్ రాజశేఖర రెడ్డి సభలో ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. తమది రెండు కళ్ల సిద్ధాంతమైనా చూపు ఒక్కటేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి వాకౌట్, టాకౌట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకూలంగా మాట్లాడిందని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగానే తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైయస్సార్ కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. తమ బాటలోనే చంద్రబాబు నడవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అప్పుడు సూచించారని ఆయన అన్నారు. వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన విషయాలను, సందర్భాలను ఆయన గుర్తు చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి తలారీ అని వాడిన మాటపై తీవ్రమైన గందరగోళం నెలకోంది. అ పదప్రయోగానికి శైలజానాథ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను ఆ పదం శైలజానాథ్ను ఉద్దేశించి అనలేదని భూమన వివరఇ ఇచ్చారు. ఈ సందర్భంలో వైయస్సార్ కాంగ్రెసుపై శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ సిఎం పదవి కోసం సంతకాలు సేకరించలేదా అని తెలుగుదేశం సభ్యుడు ధూళిపాల్ల నరేంద్ర చౌదరి అడిగారు. కాంగ్రెసుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం కలిసి నడుద్దామంటే ఎందుకు ముందుకు రాలేదని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అజ్ఝానం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. పది నిమిషాల వాయిదా తర్వాత శాసనసభ తిరిగి ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications