హైకోర్టు విభజనపై జితేందర్: సహకరిస్తామన్న వెంకయ్య
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు విభజన అంశం లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవగానే లోక్సభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తారు. ఏపీ విభజన బిల్లులో హైకోర్టును విభజిస్తామని పేర్కొని నేటికీ ఆ ప్రక్రియను ప్రారంభించలేదని, ఈ కారణంగా అనేక కేసులు పెండింగ్లో పడిపోతున్నాయని జితేందర్ రెడ్డి లోక్సభకు వివరించారు.
అంతేకాకుండా హైకోర్టు పోస్టుల భర్తీలోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హైకోర్టు విభజనకు సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశమై న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

కాగా, హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాంచందర్ రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజనం అంశంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయనే పీఆర్సీ ప్రకటించారన్న ఆయన వెంటనే ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని ఆయన జోష్యం చెప్పారు.












Click it and Unblock the Notifications