రాజధానులపై సుప్రీంకోర్టు విచారణ-అమరావతి పాదయాత్రపై హైకోర్టు తీర్పు-టర్నింగ్ పాయింట్ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మూడు రాజధానుల వ్యవహారానికి ఇవాళ ఓ టర్నింగ్ పాయింట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అమరావతి రైతులు ఒకే రాజధాని కోరుతూ అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రపై హైకోర్టు కూడా కీలక నిర్ణయం వెలువరించబోతోంది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు నిర్ణయాలు కూడా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.
సుప్రీంలో మూడు రాజధానుల విచారణ
ఏపీలో మూడు రాజధానుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గతంలో హైకోర్టు అమరావతి రాజధానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఆరునెలల తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ చేపట్టబోతోంది. అదే సమయంలో అమరావతి రైతులు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ కొన్ని లోపాలు ఉన్నాయని, వీటిని సవరించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ జరపబోతోంది.
అమరావతి పాదయాత్రపై హైకోర్టు తీర్పు
అదే సమయంలో రాష్ట్ర హైకోర్టు అమరావతి రైతులు అరసవిల్లికి చేపట్టిన మహా పాదయాత్రకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కీలక తీర్పు ఇవ్వబోతోంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వు చేసింది.ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ పాదయాత్ర కొనసాగింపుపై తుది తీర్పు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన అమరావతి రాజధాని తీర్పు కూడా అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది.
బిగ్ టర్నింగ్ పాయింట్ ?
సుప్రీంకోర్టులో జరిగే మూడు రాజధానుల విచారణలో ప్రభుత్వ పిటిషన్ పై వాదోవవాదాలు జరగబోతున్నాయి. వీటి తర్వాత సుప్రీంకోర్టు ఏదైనా కీలక నిర్ణయం ప్రకటిస్తే అమరావతి రాజధానికి సంబంధించిన పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మరోసారి విచారణ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముంది. మరోవైపు హైకోర్టు అమరావతి పాదయాత్రకు అనుకూలంగా తీర్పు ఇస్తే పాదయాత్ర కొనసాగే అవకాశాలున్నాయి. లేకపోతే మాత్రం ప్రభుత్వ వాదన నెగ్గుతుంది. ఇందులో ఏది జరిగినా వైసీపీ ప్రభుత్వం, విపక్షాల మధ్యసాగుతున్న రాజకీయ పోరు కూడా మరో మలుపు తిరగడం ఖాయం.