చంద్రబాబుకు ఢిల్లీ టూర్ లో నిరాశ- మోడీ, షా అపాయింట్ మెంట్లు కరవు- గతంమర్చిపోలేదా?
ఏపీలో పట్టాభి ఎపిసోడ్, తదనంతర పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ టీమ్ కు అక్కడ నిరాశ తప్పేలా లేదు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతల బృందానికి అక్కడ అపాయింట్ మెంట్ల విషయంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. దీంతో ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ బృందానికి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
పట్టాభి ఎపిసోడ్ పై ఢిల్లీకి బాబు
ఏపీలో టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్, డీజీపీ సవాంగ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీ కార్యాలయాల్ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు దాడులకు దిగారు. దీంతో రాష్ట్రంలో పరిస్ధితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్ధితుల్ని సైతం వివరించారు.
అంతటితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, అమిత్ షాను కలవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వైసీపీ సర్కార్ పై ఓ పుస్తకం తయారు చేసుకుని మరీ అక్కడికి వెళ్లారు. పట్టాభి ఎపిసోడ్, తదనంతర పరిణామాలపై కేంద్రంలో బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలనేది చంద్రబాబు లక్ష్యం.
రాష్ట్రపతి అపాయింట్ మెంట్
చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లేముందే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ కోరారు. దీంతో ఆయన నిన్న టీడీపీ బృందం తనను కలిసేందుకు టైం ఇచ్చారు. దీంతో నిన్న రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం రాష్టంలో తాజా పరిణామాలతో పాటు గతేడాది ఘటనల్ని సైతం కలిపి ఫిర్యాదులు చేసింది. వీటిని సావధానంగా విన్న రాష్ట్రపతి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వీరిని పంపేశారు. దీంతో రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు చేసుకున్న ప్రచారం తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటనలూ రాలేదు. కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు.
అపాయింట్ మెంట్లు ఇవ్వని మోడీ-అమిత్ షా
రాష్ట్రపతిని కలిసిన తర్వాత నిన్న కాకపోతే ఇవాళ అయినా తమకు ప్రధాని మోడీ లేదా అమిత్ షా, కుదిరితే ఇద్దరి అపాయింట్ మెంట్లు లభిస్తాయని చంద్రబాబు గంపెడాశలు పెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడినప్పుడు స్పందించిన అమిత్ షా .. ఇప్పుడు అపాయింట్ మెంట్ కూడా ఇస్తారని చంద్రబాబు భావించారు.
కానీ అలా జరగలేదు. గతంలో అమిత్ షా పై తిరుపతిలో రాళ్లేయించిన చరిత్ర ఉన్న చంద్రబాబును ఆయన దగ్గరికి కూడా రానీయలేదు. అమిత్ షానే రానివ్వనప్పుడు ఇక ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరుకుందని అనుకోవడం మరింత కష్టం. అయినా చంద్రబాబు మాత్రం ఇవాళ ఏదో సమయంలో తనకు అపాయింట్ మెంట్ దొరుకుందని ఎదురుచూస్తున్నారు.
పాత పగలు మర్చిపోలేదా?
గతంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కార్ లో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. రాష్ట్రంలో బీజేపీ నేతల్ని సైతం చంద్రబాబు కేబినెట్లో చేర్చుకుంది. అయితే ఆ తర్వాత జగన్ ఒత్తిడితో కేంద్రంపై పోరు ప్రారంభించిన చంద్రబాబు.. చివరికి ధర్మపోరాటం పేరుతో విపక్ష నేతలందరినీ కూడగట్టి ఎన్డీయేపై, మోడీ-అమిత్ షా ద్వయంపై విరుచుకుపడ్డారు.
చివరికి మోడీని వ్యక్తిగతంగా దూషించే వరకూ వెళ్లారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ.. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని, తన కొడుకు లోకేష్ కోసమే అంతా దోచిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్డీయే గతం కంటే ఘనవిజయం సాధించడం, టీడీపీ కనీస సీట్లకు పరిమితం కావడం చకచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడు పట్టాభి ఎపిసోడ్ తో ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా మోడీ-షా కరుణించడం లేదు. దీంతో బాబు ఢిల్లీ టూర్ నిరాశగా ముగిసేలా కనిపిస్తోంది.