'హుధుద్ కంటే చంద్రబాబు వల్లే విశాఖకు ఎక్కువ నష్టం జరిగింది'
విజయవాడ: హుధుద్ తుఫాన్ కంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే విశాఖ నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ బుధవారం ఆరోపించారు. హుధుద్ తుఫాను సంభవించి నేటికి రెండేళ్లు ముగిసినా ప్రజలకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు.
నేటికి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆ తుపాను వల్ల రూ.లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధాని నరేంద్ర మోడీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీంతో రూ.వెయ్యి కోట్ల ఇస్తానన్న ప్రధాని కేవలం రూ.480 కోట్ల ఇచ్చారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాల కోసం రూ.450 కోట్ల ఖర్చు చేశామని చెప్పిందని, ప్రపంచ స్థాయిలో సేకరించిన నిధుల్లో ఒక్క పైసా కూడా పట్టణానికి ఖర్చు చేయలేదన్నారు. ప్రచార వ్యామోహంతో హుధుద్ తుఫానును గెలిచామని, ప్రకృతిని జయించిన వీరుడిలా చంద్రబాబు ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
హుధుద్ కంటే చంద్రబాబు ప్రచారం వల్లే విశాఖకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. చంద్రబాబు వల్లే విశాఖకు పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. ఇప్పటుకైనా ప్రభుత్వం హుధుద్ తుఫాను బాధితులకు తక్షణం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రచారం మానుకోకుంటే: వైసిపికి రావెల హెచ్చరిక
రాష్ట్ర అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలని జగన్ కుట్ర పన్నుతున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు బుధవారం మండిపడ్డారు. నారా లోకేష్ మచ్చలేని నాయకుడు అన్నారు. లోకేష్ పైన అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే కార్యకర్తలు తరిమి కొడతారన్నారు.