జగన్ సర్కార్ కు భారీ ఊరట-రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు...
ఏపీలో రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటుపై నెలకొన్న వివాదం విషయంలో ఇవాళ జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమంటూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. దీంతో అమరావతిలో ఇళ్ల స్ధలాల కేటాయింపుకు మార్గం సుగమమైంది.
అమరావతి రాజధాని కోసం సేకరించిన భూముల్లోని 1100 ఎకరాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైసీపీ సర్కార్ భూములు కేటాయించింది. అయితే రాజధాని కోసం తాము ఇచ్చిన భూముల్ని పేదల పేరుతో పంచి పెట్టడం సరికాదని రైతులు వాదించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 45ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి అక్కడ ఊరట దక్కలేదు.

రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే వాదోపవాదాలు విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇందులో హైకోర్టు తీర్పుకు లోబడి పేదలకు అమరావతిలో ఇళ్ల స్దలాలు ఇచ్చేందుకు అంగీకరించింది. రాజధాని ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ల వద్ద సమాధానం లేదు. దీంతో ఆర్ 5 జోన్ పై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం గతంలో టీడీపీ సర్కార్ సేకరించిన భూముల్ని ఇతరత్రా అవసరాల కోసం వాడేందుకు అక్కడి రైతులు అంగీకరించడం లేదు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటికే రాజధానిగా అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న రైతులు.. ఈ నిర్ణయంపైనా న్యాయపోరాటానికి దిగారు. కానీ హైకోర్టు మాత్రం దీనికి అంగీకరించలేదు. వైసీపీ సర్కార్ నిర్ణయంపై గతంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన రైతులకు అక్కడా ఊరట దక్కలేదు.












Click it and Unblock the Notifications