ఏపీలో బీఈడీ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యారంగ సంస్కరణల్లో భాగంగా బీఈడీ కాలేజీల్లో ప్రమాణాల మెరుగుకు ప్రయత్నిస్తోంది. ఇందులో కళాశాలల్లో తనిఖీలు కూడా ఒకటి. రాష్ట్ర ఉన్నత విద్యామండలితో బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేయించేందుకు గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఇవాళ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దీంతో బీఈడీ కాలేజీల యాజమాన్యాలకు భారీ ఊరట దక్కినట్లయింది.
గతంలో బీఈడీ కాలేజీల్లో తనిఖీలను విద్యాశాఖకు చెందిన అధికారులే చేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం తాజాగా వాటిని ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉన్నత విద్యామండలి తన విధుల్లో భాగం కాని తనిఖీలు చేపట్టాల్సిన పరిస్దితి ఏర్పడింది. దీనిపై పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీఈడీ కాలేజీలు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది.

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం బీఈడీ కాలేజీల్లో ఉన్నత విద్యామండలితో తనిఖీలు చేయించేందుకు ఇచ్చిన జీవోను హైకోర్టు ఇవాళ రద్దు చేసింది. సెక్షన్ 31 ప్రకారం ఉన్నత విద్యామండలితో బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేయించడం చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. అయితే విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులతో తనిఖీలు చేయించుకోవచ్చని హైకోర్టు సూచించింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి పాత విధానంలోనే బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications