AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా ఓ వెలుగు వెలిగి అనంతరం వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ భారీ ఊరట లభించింది.
ఆయనపై గతంలో వైసీపీ ప్రభుత్వం రెండోసారి విధించిన సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇవాళ కొట్టేసింది. ఈ మేరకు ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన క్యాట్ ఇవాళ తన తీర్పును వెలువరించింది. దీంతో ఏబీకి సుదీర్ఘ విరామం తర్వాత ఊరట లభించినట్లయింది.

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న సమయంలో విపక్ష నేతలపై ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు తెప్పించినట్లు వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపింది. ఇదే అభియోగంపై ఆయనపై తొలిసారి సస్పెన్షన్ విధించిన ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది. తాను నిఘా పరికరాలకు ఆర్డర్ మాత్రమే చేశానని, పరికరాల కొనుగోలు కూడా జరగలేదని ఏబీ వెంకటేశ్వరరావు వాదించారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ తొలగించారు.
అయితే ఆ తర్వాత కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు సస్పెన్షన్ కాలంలో జీతభత్యాల బకాయిలు చెల్లించలేదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో మరోసారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తిరిగి ఆయన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ అభియోగాలు, సస్పెన్షన్ పై విచారణ జరిపిన క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావును నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ ఆయనపై విధించిన సస్పెన్షన్ కొట్టేస్తూ తీర్పు ప్రకటించింది.
తనపై ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెన్షన్ విధించడం చెల్లదని ఏబీ వెంకటేశ్వరరావు వాదించారు. దీంతో క్యాట్ ఏకీభవించింది. గతంలో ఓసారి ఇదే అభియోగంతో సస్పెన్షన్ విధించడం, దాన్ని కోర్టు కొట్టేయడం జరిగిపోయాక మరోసారి అదే అభియోగంతో రెండోసారి సస్పెన్షన్ చెల్లదని క్యాట్ తేల్చేసింది.












Click it and Unblock the Notifications