ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కు ఊరట-సాయిరెడ్డి ట్వీట్-కుట్రలన్నీ పటాపంచలంటూ..
ఏపీలో వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్ధలాల్ని నదీ ప్రవాహాల్ని మార్చేలా కేటాయిస్తోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి పలు ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల ఇళ్ల పట్టాల కేటాయింపు నిలిచిపోయింది. తాజాగా దీనిపై ఎన్జీటీ స్పందించింది. ఏపీలో ఇళ్ల పట్టాల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఇళ్ల పట్టాల కేటాయింపు నదీ ప్రవాహాల్ని మార్చేలా ఉందంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన ఎన్జీటీ.. ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించడంతో టీడీపీ పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. అంతే కాదు ఎన్జీటీ ఉత్తర్వుల ఆధారంగా టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తూ నదీ ప్రవాహాలు మారిపోతాయా ? కరకట్టను కబ్జా చేసి బంగ్లాలు కట్టుకుంటే నదులను పరిరక్షించినట్లా చంద్రబాబూ అంటూ తన ట్వీట్ లో విజయసాయిరెడ్డి టీడీపీ అధినేతను ప్రశ్నించారు. తద్వారా ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసం ఆరోపణల్ని మరోసారి తెరపైకి తెచ్చారు.
ఇప్పటికే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు లీజుకు తీసుకుని నివసిస్తున్న ఇంటిని టార్గెట్ చేసింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదికి ప్రవాహం సముద్రంలోకి వెళ్లేలా గేట్లు ఎత్తకుండా తన ఇంటి ముంపుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబు కూడా గతంలో ఆరోపణలు చేశారు.