రామోజీ రావు కోడలు శైలజకు ఊరట-లుకౌట్ నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశం..
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ జారీ చేసిన లుకౌట్ నోటీసుల వ్యవహారంలో ఎండీ చెరుకూరి శైలజకు ఊరట లభించింది. ఏపీ సీఐడీ జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే రామోజీరావుతో పాటు శైలజపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా సీఐడీ లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాలపై వైసీపీ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే సంస్ధ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు నిర్వహించడంతో పాటు మేనేజర్లపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపింది. అలాగే మార్గదర్శ చిట్స్ అక్రమాల కేసులో ఈనాడు పత్రిక యజమాని రామోజీరావును ఏ1గా చేర్చడంతో పాటు ఆయన కోడలు, మార్గదర్శి ఎండీగా ఉన్న చెరుకూరి శైలజను ఏ2గా చేర్చింది. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో సీఐడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

ఏపీ సీఐడీ తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని సవాల్ చేస్తూ ఎండీ శైలజ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సీఐడీకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని ఇందులో ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా మార్గదర్శి సంస్ధ ఎండీ హైదరాబాద్ లో ఉండటం, సంస్ధపై ఫిర్యాదులు లేకపోవడం, సంస్ధకు సంబంధించిన రికార్డులు అన్నీ సీఐడీ వద్దే ఉండటంతో కఠిన చర్యలు వద్దంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు ప్రస్తావించింది.
ఈ కేసులో పిటిషనర్ అయిన మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ హైకోర్టు పరిధిలోకే వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిపే పరిధి తమకుందన్నారు. గతంలోనూ హైకోర్టు మార్గదర్శి కేసులో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా గుర్తుచేశారు. అలాగే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు కూడా ఉన్నాయన్నారు. అయినా సీఐడీ లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో సస్పెండ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications