జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్- ఇక వాటిని కెలికితే మంటలే-వేల కోట్లు భరించాల్సిందే
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా అంతిమంగా కీలక అంశాల వద్దకు వచ్చే సరికి ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటివరకూ పూర్తిగా అమలు చేయని కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలుగా మారుతున్న ఒప్పందాల విషయంలోనూ కనికరించడం లేదు. కేంద్రంతో సీఎం జగన్ ఎంత లాబియింగ్ చేస్తున్నా తమ ప్రయోజనాల్ని కాదని కేంద్రం రాష్ట్రానికి సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా పీపీఏలపై కేంద్రం తీసుకున్న నిర్ణయమే దీనికి ఉదాహరణ.
కేంద్రంతో వైసీపీ సంబంధాలు
ఏపీలో 2019లో అధికారంలోకి రాకముందు కేంద్రంతో అంత సన్నిహిత సంబంధాలు లేని వైఎస్ జగన్.. ఓసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంతో అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ముందుకు పోతున్నారు. అడిగినా, అడగకపోయినా కీలక అంశాల్లో వైసీపీ ఎన్డీయే సర్కార్ కు మద్దతిచ్చిన తీరు చూసి దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు అవాక్కవుతున్న పరిస్ధితి.
మరి ఇంత గొప్పగా సాయం చేస్తున్న జగన్ సర్కార్, వైసీపీతో కేంద్రం ఎలా వ్యవహరించాలి ?, జగన్ అడిగిందల్లా కాదనకుండా ఇచ్చి తీరాల్సిందే. కానీ అలా జరుగుతుందా అంటే మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన మరో కీలక అంశంలో కేంద్రం వ్యవహరించిన తీరు జగన్ సర్కార్ కు మంటపుట్టిస్తోంది.
చంద్రబాబు హయాంలో పీపీఏలు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్ అందించే పేరుతో భారీ ఎత్తున ప్రైవేటు విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ ఒప్పందాలు వచ్చే పాతికేళ్ల కాలానికి వర్తించబోతున్నాయి. అంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారనే దానితో సంబంధం లేకుండా వచ్చే పాతికేళ్ల పాటు ఈ ఒప్పందాల్ని అమలు చేసి తీరాల్సిందే. అలా చేయడంలో విఫలమైతే మాత్రం న్యాయవివాదాలు తప్పవు. దీంతో అప్పటి టీడీపీ సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు.
పీపీఏలపై జగన్ సమీక్ష
వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్షలు నిర్వహిస్తామని ఎప్పటినుంచో చెప్తూ వచ్చిన వైఎస్ జగన్.. సీఎం కాగానే దీనికి తెరతీశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు దిగారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం వచ్చే పాతికేళ్లలో దాదాపు 20 వేల కోట్లను భరించే పరిస్ధితుల్లో లేదు కాబట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సవరించాలని ఉత్పత్తి సంస్ధలకు సూచించారు. దీంతో చంద్రబాబు సర్కార్ తో ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తిదారులు బెంబేలెత్తారు. కోర్టుల్ని ఆశ్రయించారు. పీపీఏల సమీక్ష వద్దంటే వద్దంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నారు.
కేంద్రంతో విద్యుత్ సంస్ధల లాబీయింగ్
గతంలో చంద్రబాబు సర్కార్ తో తాము చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని తిరగతోడటం మొదలైతే ఇక కష్టాలు తప్పవని భావించిన విద్యుత్ ఉత్పత్తిదారులు కేంద్రాన్ని ఆశ్రయించారు. కోర్టుల ద్వారా తాత్కాలిక ఊరట లభించినా అంతిమంగా విధానపరమైన రక్షణ లేకుంటే సమస్యలు తప్పవని భావించారు. కేంద్రం వద్ద దీనికి అవసరమైన లాబీయింగ్ చేపట్టారు. చివరికి వారిదే పైచేయి అయింది. విద్యుత్ ఉత్పత్తిదారులు కోరుతున్న పలు అంశాలకు కేంద్రం వంత పాడింది. దీంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిన ఒప్పందాలపై కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసేసుకుంది.
పీపీఏల్ని కెలకడానికి వీల్లేదన్న కేంద్రం
గతంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో విద్యుత్ ఉత్పత్తిదారులు చేసుకున్న ఒప్పందాలను సమీక్షించేందుకు కేంద్రం ససేమిరా అంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో విద్యుత్ ఒప్పందాల్ని సమీక్షించి సవరించినా, చట్టాలు, పన్నుల విధానం మార్చినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గించినా, సరఫరా సామర్ధ్యం తగ్గించినా తగిన పరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేస్తోంది. పీపీఏల్ని కెలకడం వల్ల వచ్చే నష్టాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చిచెప్పేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయంపై బెంబేలెత్తుతున్నాయి.
జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్
గతంలో ముందున్న ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు జగన్ సర్కార్ కు భారీ షాకిచ్చాయి. విద్యుత్ చట్టంలోని నిబంధనల ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను మధ్యలో సమీక్షించడం కానీ, మార్పులు చేర్పులు కానీ చేస్తే వాటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు తలెత్తే నష్టాల్ని, పడే ప్రభావానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే రాష్టప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ సంస్ధలకు కలిగే నష్టాల్ని లెక్కించడానికి కూడా ఓ విధానాన్ని సైతం ప్రకటించింది. ఈ విధానం వల్ల భారీ పెట్టుబడులు పెట్టి విద్యుత్ సంస్ధలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు భద్రత ఉంటుందని కేంద్రం చెబుతోంది. దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీంతో తమకు ఇష్టమున్నా, లేకున్నా, భారమైనా, కాకున్నా జగన్ సర్కార్ కచ్చితంగా చంద్రబాబు సర్కార్ లో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్ని అమలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.