టీడీపీకి భారీ షాక్.. రేవంత్ బాటలో వేం నరేందర్ రెడ్డి, రేపటికల్లా మరికొందరు!?
వరంగల్ టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డినే అనుసరించారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఇది ఇంతటితో ఆగదని, ఆదివారానికల్లా మరికొందరు రాజీనామా చేస్తారని అంటున్నారు.
అమరావతి: రేవంత్ రెడ్డి ఒక్కడేనా? లేక ఆయన బాటలో మరికొందరు టీడీపీ నాయకులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తోన్న ప్రశ్న ఇది.
తెలుగుదేశం పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరితే ఆయనతోపాటు వెళ్లే నేతల్లో ప్రధానంగా వినిపించిన పేరు వేం నరేందర్ రెడ్డి.
వేం నరేందర్ రెడ్డి రాజీనామా...
ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో టీడీపీకి ముఖ్యనేత అయిన వేం నరేందర్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. నరేందర్ రెడ్డితో పాటు భూపాలపల్లి జిల్లాలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు, నల్గొండ జిల్లా నుంచి పోలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి, సీతక్కతో పాటు పలువురు పార్టీ మారతారని ఇటీవల కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.
మీడియాకు దూరంగా...
శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి విజయవాడ నుంచి నేరుగా తన నియోజక వర్గమైన కొడంగల్కు బయలుదేరారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి తన మద్దతుదారులతో కీలక చర్చలు జరపనున్నారు. తన రాజీనామా నేపథ్యంలో ఆయన మీడియాతో ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు. మీడియాతో ఫోన్లో కూడా మాట్లాడడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నవంబరు 9న ఆయన కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
రేపు మరికొందరి రాజీనామా?
రేవంత్రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటం.. తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి వెంట నడిచేందుకు మరికొందరు టీటీడీపీ నాయకులు కూడా సిద్ధమవుతున్నారని ఆదివారం ఉదయం కల్లా మెజారిటీ తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా రాజీనామాలు సమర్పించవచ్చునని వినిపిస్తోంది. రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయనతోపాటు టీడీపీ నేతలు చాలామంది హస్తం గూటికి వెళతారని భావిస్తున్నారు. ఈ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పొత్తులపై అప్పుడే నిర్ణయమన్న బాబు...
మరోవైపు తెలంగాణ టీడీపీలో పరిస్థితులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. టీటీడీపీ ఖాళీ కాకుండా చూసేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో శనివారం తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రేవంత్రెడ్డి వ్యవహారంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈ భేటీ అనంతరం టీ టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు.
టీటీడీపీ భవిష్యత్ కార్యాచరణపై...
టీటీడీపీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 2న ఎన్టీఆర్ భవన్లో జరిగే సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై.. దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని సమాచారం. అయితే పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.