ఏపీ గడ్డపై అడుగు పెట్టిన బిల్ గేట్స్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో అడుగు పెట్టారు. ఆయన ప్రయాణిస్తోన్న ప్రత్యేక విమానం కొద్దిసేపటి కిందటే విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటం వల్ల బిల్ గేట్స్ ప్రయాణించిన విమానం ల్యాండింగ్ లో జాప్యం చోటు చేసుకుంది. క్లియరెన్స్ కోసం కొంత సమయం గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అనంతరం క్లియరెన్స్ లభించగానే, అది సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీలో జరగనున్న ఎఐ-ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ కోసం బిల్ గేట్స్.. భారత్ కు వచ్చారు. ఆయన పర్యటన ఏపీతో ప్రారంభమైంది.

ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత ఆధారిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ఆయా రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించనుంది. గేట్స్ ఫౌండేషన్తో కలిసి పని చేయడానికి తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నామని నారా లోకేష్ తెలిపారు.
కాగా- నేటి నుండి 20వ తేదీ వరకు AI ఇంపాక్ట్ సమ్మిట్ జరుగనుంది. దీనికి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, మల్టీ నేషనల్ కంపెనీల అధినేతలు హాజరు కానున్నారు. ఈ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించనున్నారు. సమ్మిట్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ భారత్ విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధిస్తున్న పురోగతిని, అది ప్రపంచ అభివృద్ధికి అందిస్తున్న అద్భుతమైన సహకారాన్ని వివరించారు. వారి భాగస్వామ్యాన్ని కోరారు. భారత్ శాస్త్ర, సాంకేతిక రంగంలో వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచ అభివృద్ధికి దోహదం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.












Click it and Unblock the Notifications