జనన ధృవీకరణ పత్రమే అన్నిటికీ ఆధారం.. కేంద్రం కొత్తచట్టం!!
కేంద్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి జనన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. ఇకపై జనన ధృవీకరణ పత్రమే అన్నిటికీ ఆధారం అని కేంద్రం కొత్త చట్టం చెబుతోంది. విద్యా సంస్థల్లో ప్రవేశంతో పాటు నియామకాలతో సహా దేనికైనా జనన దృవీకరణ పత్రము ప్రధానమని కేంద్రం పేర్కొంది.
ఇక కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పుట్టిన వ్యక్తి యొక్క తేదీని, ప్రదేశాన్ని నిర్ధారించేది జనన ధ్రువీకరణ పత్రం. అయితే చాలామంది బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.

ఇకనుండి ఏ పని జరగాలన్న కచ్చితంగా బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, కేంద్రం చట్టాన్ని తీసుకురావడంతో ప్రజలలో దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, తప్పనిసరిగా గత ఏడాది అక్టోబర్ నుండి జన్మించిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ఇదే అవసరమవుతుందని చెబుతున్నారు ఏపీ సి ఎస్.
పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి, వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. ఇలా ప్రతి ఒక్కదానికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు దీనిపైన అవగాహన కల్పించాలని చెప్పిన సి ఎస్ ఆసుపత్రులలోను, నగర పంచాయతీలు, పంచాయతీలలోను జనన, మరణాలను నమోదు చేయడానికి, ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి మొత్తం 14 వేల 752 యూనిట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేయాలని, ప్రజలకు వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు అందజేయాలని జనన మరణాల డేటాను ఇకపై కేంద్రం, రాష్ట్రాలు నిర్వహిస్తాయని పేర్కొని ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన కలిగించాలని సూచించారు. ఇకపై భవిష్యత్ తరాల వారు బర్త్ సర్టిఫికెట్ ను తీసుకుని భద్రంగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications