గడప గడపలో షాకింగ్ ప్రశ్న- ఎమ్మెల్యే వంశీ సెటైర్-అంతే ఘాటుగా మహిళ కౌంటర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ఎమ్మెల్యేల్ని కోరుతున్నారు. అయితే ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు అక్కడక్కడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇదే క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే విజయవాడ శివారు రామవరప్పాడులో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వంశీకి స్ధానికంగా ఉద్యోగావకాశాల కల్పనపై మహిళలు ప్రశ్నించారు. అందులో ఓ మహిళ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెళ్లిపోయాయని వంశీని నిలదీశారు. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. మీ సీఎం జగన్ ను అడిగి ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావాలని కోరారు.
దీంతో వంశీ వ్యంగంగా స్పందించారు. చూడండి అక్కా.. మీరు ఆ రెండు పత్రికలు బాగా చూస్తున్నట్లున్నారు అన్నారు. దీంతో ఆ మహిళకు ఒళ్లు మండింది. మీరు పెద్దవాళ్లు అయింది ఆ పత్రికల వల్లేగా అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీంతో వంశీ అవాక్కయ్యారు. కాసేపు మిన్నకున్న వంశీ.. అనంతరం ఐటీ కంపెనీలు వెళ్లిపోవడంపై వివరణ ఇచ్చారు. ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పనిచేయలేకపోవడంతో ఆయా కంపెనీలు వెళ్లిపోయాయంటూ చెప్పుకొచ్చారు. దీనికి ఇంకా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో వంశీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.