బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు: బాబుకు చెక్, పవన్ కల్యాణ్తో దోస్తీ?
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు సోము వీర్రాజు నియమితులయ్యారు. ఈ విషయాన్ని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. వీర్రాజు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఉన్నారు.
ఆయన గతంలో పార్టీలో పలు పదవులు నిర్వహించారు. సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వెనక బిజెపి మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు పవన్ కల్యాణ్కు సన్నిహితుడు. దానికితోడు, ఇటీవల ఆయన చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నిజానికి, పవన్ కల్యాణ్ను సంతోషపెట్టడానికే చంద్రబాబు సోము వీర్రాజుకు చంద్రబాబు బిజెపి అధిష్టానంతో మాట్లాడి ఎమ్మెల్సీ సీటు ఇప్పించారని అంటారు. ఇప్పుడు ఆయనే చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి తగిన బలాన్ని సమీకరించుకోవడానికి చంద్రబాబుకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కూడా సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తునట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్తో దోస్తీ కట్టి, సొంత బలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలనే ఆలోచనతో బిజెపి అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న కాపు నాయకులను కూడా చేరదీయడానికి సోము వీర్రాజు నాయకత్వం పనికి వస్తుందని భావిస్తున్నారు.
రాజధాని భూముల విషయంలో, కాపు సమస్యలపై, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై, తదితర సమస్యలపై చంద్రబాబు చిక్కులను ఎదుర్కుంటున్నారు. ఈ స్థితిలో క్రమంగా చంద్రబాబుకు దూరం జరగాలనే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ టిడిపిో పొత్తు కొనసాగించాల్సి వస్తే సీట్ల సర్దుబాటు ఏకపక్షంగా ఉండకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు.
నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత పలువురు ముఖ్య నాయకులు బిజెపిలో చేరారు. పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ వంటి ముఖ్య నాయకులు ఉన్నప్పటికీ వారికి పని లేకుండా పోయింది. చంద్రబాబుతో స్నేహం కారణంగా వారు రంగంలోకి దిగే పరిస్థితి లేదు.
అప్పుడప్పుడు పురంధేశ్వరి ముందుకు వస్తుంటే టిడిపి నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితిలో సోము వీర్రాజు పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ పార్టీకి సొంత బలాన్ని సమీకరించగలరనే ఉద్దేశంతో పార్టీ అదినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.