పవన్ కల్యాణ్ పై మాట దాటేసిన వీర్రాజు..?
ఏపీకి ఏకైకా రాజధానిగా అమరావతికే భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉందని, అందులో మరో వివాదానికి తావు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మీడియా ప్రతినిధులే వైసీపీ ప్రశ్నించాలని సలహా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు. పర్యటన వివరాలను సోము ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి వెల్లడించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వివరాలను ముందే ప్రకటించారని చెప్పగా.. ప్రధానమంత్రి పర్యటన క్రెడిట్ మొత్తం వైసీపీ కొట్టేయాలనుకుంటోందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రశ్నించగా సోము సమాధానం చెప్పలేదు.
భారతీయ జనతాపార్టీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఈరోజు వరకు వారిద్దరూ కలిసి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. ఏ పార్టీకి ఆ పార్టీయే ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటోంది. ఇటీవల విజయవాడలో పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత జనసేన తమతోనే ఉందని బీజేపీ నాయకులు ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ ఇటీవలే భీమవరంలో పర్యటించారు. అలాగే పార్టీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో సభకు హాజరయ్యారు. ఈ రెండు కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం ఉందా? లేదా? అనే విషయంలో ఆ పార్టీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో మాత్రం జనసేన తమతోనే ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. తమకు జనసేన ఒక్కటే మిత్రపక్షమని, ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేస్తున్నారు.