జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ పోరుకు హైకమాండ్ ప్రశంసలు-సోము ట్వీట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ మూడున్నరేళ్లలో మిత్రపక్షం జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ నేతలు ప్రజాపోరుతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ మధ్యే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పాటు చిన్న చిన్న స్ధాయిలో 5 వేల సభలు నిర్వహించారు. వీటిపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తాజాగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ఏపీ బీజేపీ పోరును హైకమాండ్ ప్రశంసించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ తో కలిసి పాల్గొన్న సోము ఆ ఫొటోల్నికూడా షేర్ చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర యూనిట్ నిర్వహించిన ప్రజా పోరు కార్యక్రమంపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ సాగిన "ప్రజాపోరు" కార్యక్రమం విధి విధానాలను కేంద్ర పార్టీ ప్రశంసించిన నేపథ్యంలో నేడు 2వ రోజు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కార్యక్రమ వివరాలను తెలియజేశాను. @blsanthosh@JPNadda pic.twitter.com/O1chlW7TgE
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) January 17, 2023
వైసీపీ ప్రభుత్వంతో కేంద్ర పార్టీ నేతలు సత్సంబంధాలు నెరుపుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం జనం ఆకాంక్షలకు తగినట్లుగా పోరాటాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు సందర్భానుసారంగా విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ-వైసీపీ మధ్య పరోక్షంగా అవగాహన ఉన్నట్లు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నా అవి కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండే సహజ సంబంధాలేనని కాషాయ నేతలు చెప్తున్నారు. అందుకే క్షేత్రస్దాయిలో వైసీపీ సర్కార్ విధానాలపై పోరాటం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ రాష్ట్ర నేతలకు అధిష్టానం మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.