కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపింది..ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది: కంభంపాటి
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేతులు కలిపిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరిగిన సందర్భంగా హరిబాబు టీడీపీ కాంగ్రెస్ల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని...కానీ ఈరోజు అదే టీడీపీ కాంగ్రెస్తో చేతులు కలపడంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని కంభంపాటి గుర్తు చేశారు. ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చన్న హరిబాబు... ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుందంటూ టీడీపీకి పరోక్షంగా చురకలంటించారు.
ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కంభంపాటి మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం ఏపీ విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదని కాంగ్రెస్ను ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ఆ నెపం బీజేపీపై పెట్టడం సరికాదన్నారు. హరిబాబు ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. ప్రత్యేక హోదా కేవలం పేరుకు మాత్రమే అన్న హరిబాబు... అంతకంటే మించిన ప్యాకేజీని ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఆనాడు స్పెషల్ ప్యాకేజీని ఏపీ ప్రభుత్వం ఆమోదించిందని ఆయన గుర్తుచేశారు. 14వ ఆర్థిక సంఘం కూడా రెవెన్యూలోటును భర్తీ చేయాలని చెప్పిందని సభకు తెలియజేశారు కంభంపాటి. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీ తిరిగి యూటర్న్ తీసుకుంటోందని మండిపడ్డారు.
14వ ఆర్థిక సంఘం సూచించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు. హోదా అనే పేరు లేదు కానీ... అంతకుమించినవన్నీ కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. రూ.17500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిన హరిబాబు... అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదని అన్నారు. అంతేకాదు బ్యాంక్ అకౌంట్ నెంబరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అందులోనే డబ్బులను డిపాజిట్ చేయడం జరుగుతుందని కంభంపాటి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కడితే... కొన్ని మండలాలు ముంపునకు గురవుతాయని భావించిన కేంద్రం... ఆ ప్రాంతాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారన్న నమ్మకం ప్రజలకు గడ్కరీ కల్పించారని హరిబాబు చెప్పారు. అనుకున్న సమయానికే తమ ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుందన్నారు.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని నివేదిక వచ్చినప్పటికీ.. కేంద్రం మాత్రం సాధ్యసాధ్యాలపై టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారని హరిబాబు గుర్తుచేశారు. దుగరాజపట్నంపై మంత్రి నితిన్ గడ్కరీ ఆరునెలల క్రితమే లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇక విశాఖపట్నం రైల్వే జోన్పై కూడా కేంద్రం కసరత్తు చేస్తోందని కంభంపాటి చెప్పారు. టీడీపీ తమతో కలిసి వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున బీజేపీ నిలుస్తుందని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు కంభంపాటి హరిబాబు.