ఎంపీలకు బీజేపీ విప్: అవే అడుగుతా.. అవిశ్వాసంపై కొత్తపల్లి గీత, బీజేపీకి విష్ణుకుమార్ షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా నవ్యాంధ్రకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. మూడు లైన్ల విప్ జారీ చేసింది. శుక్రవారం తప్పనిసరిగా సభ్యులంతా సభకు హాజరు కావాలని పేర్కొంది.
అవిశ్వాసంపై లోకసభలో ఎల్లుండే చర్చ, స్పీకర్ ఖరారు: 'వైసీపీ సభ్యులు లేని టైం చూసి..'
మరోవైపు, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, మజ్లిస్, ఆర్జేడీ, ఆరెస్పీ, సమాజ్వాదీ పార్టీ, ఏఏపీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎశ్, బీజేడీలు మద్దతును ప్రకటించలేదు.
అవే విషయాలను నేను అడుగుతా... కొత్తపల్లి గీత
అవిశ్వాస తీర్మానం అనేది తెలుగుదేశం, బీజేపీలకు సంబంధించిన అంశం కాదని ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఇది కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశమని చెప్పారు. కేంద్రం ఏం ఇచ్చింది, రాష్ట్రం ఏం చెబుతోంది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియాలన్నారు. చర్చలో తాను ఇవే విషయాలు అడుగుతానని చెప్పారు.
Recommended Video
బీజేపీ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది.. గల్లా
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు అన్నారు. అబద్దాలు, ఆరోపణలతో టీడీపీపై నిందలు వేయడం ఏమాత్రం సరికాదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదం తెలపడంపై ఆ పార్టీ ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. తమ అవిశ్వాస తీర్మానానికి విపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయని, అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ తోట నరసింహం అన్నారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి, కేంద్రం తీరును ఎండగట్టేందుకు మంచి అవకాశం దొరికిందన్నారు.
బుట్టా రేణుకను పిలవడం చిన్న విషయం
అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం మంచి పరిణామం అని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. గత సమావేశాల్లో సభ ఆర్డర్లో లేనందువల్లే అవిశ్వాసం తీసుకోలేదని చెప్పారు. బుట్టా రేణుకను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పిలవడం చాలా చిన్నవిషయమని ఆయన చెప్పారు.
బీజేపీ నేతలకు విష్ణు కుమార్ రాజు ఝలక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే వాదనతో తాను ఏకీభవించనని విష్ణు కుమార్ రాజు తోటి బీజేపీ నేతలకు షాకిచ్చారు. ఏపీలో శాంతిభద్రతలపై బీజేపీ నేతలు గవర్నర్ సహా పలువురికి ఫిర్యాదు చేశారు. కానీ విష్ణు మాత్రం మరోలా స్పందించారు. బీజేపీ నేతలపై దాడుల వల్లే తమ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆ అంశాన్ని ప్రస్తావించి ఉంటారని చెప్పారు.