ఏపీలో కూడా: ప్రభుత్వం నుంచి తిరుమల సహా ఆలయాలకు విముక్తి: ఏపీ హైకోర్టులో పిటీషన్పై ఐవైఆర్
అమరావతి: కేరళ రాజధాని తిరువంతపురంలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి ఆలయంపై సర్వ హక్కులను ట్రావెన్కూర్ రాజవంశీయులకు కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఆలయాలను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ నాంది పలుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమల సహా అన్ని ప్రధాన ఆలయాలకూ సుప్రీంకోర్టు తీర్పును వర్తింపజేయాలనే డిమాండ్ ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది.
Recommended Video

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
అనంత పద్మనాభ స్వామి ఆలయంపై ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులు లేవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. ఆలయ పరిపాలన, నిర్వహణ బాధ్యతలన్నీ ట్రావెన్కోర్ రాజవంశీయులకు చెందుతాయంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఫలితంగా- కేరళ ప్రభుత్వానికి అనంత పద్మనాభస్వామి ఆలయంపై ఎలాంటి పెత్తనమూ ఉండదు. ఆలయానికి సంబంధించినంత వరకూ ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే సర్వాధికారులు ట్రావెన్కోర్ రాజ వంశీయులకు చెందుతాయి.

ఏపీ హైకోర్టులో పిటీషన్..
ఇదే తరహా పిటీషన్ ఒకటి ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. తిరుమల ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఏపీ హైకోర్టుపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

స్వాగతించిన ఐవైఆర్
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్వాగతించారు. ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆలయ వ్యవస్థను నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మం మీద అవగాహన, నమ్మకం లేని ప్రభుత్వాల చేతుల్లో ఆలయ వ్యవస్థ కొనసాగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం అహంభావంతో, అవగాహన లేని అధికారుల ద్వారా ఆలయ పరిపాలనను నిర్వహించడం వల్ల అరాచకాలు చెలరేగుతున్నాయని అన్నారు. ఆలయ వ్యవస్థ గాడి తప్పుతోందని వ్యాఖ్యానించారు.

రెండు తెలుగురాష్ట్రాల్లో అమలు..
అనంత పద్మనాభ స్వామి ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళలో మాత్రమే కాదని, ఏపీ, తెలంగాణల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలో పొందుపరిచిన మార్గదర్శకాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందూ ధర్మం మీద ఏ మాత్రం అవగాహన, నమ్మకం లేని ప్రభుత్వాల చేతుల్లో ఆలయ వ్యవస్థ ఉండకూడదని చెప్పారు. ఏపీ హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎంత త్వరగా ప్రభుత్వం చెర నుంచి బయటపడితే అంత మంచిదని అన్నారు.












Click it and Unblock the Notifications