ఏపీలో రద్దుల ప్రభుత్వం.. ఓ మతానికి అనుకూలం.. పంధా మార్చుకోకుంటే ప్రతిఘటన తప్పదు: బీజేపీ
ఏపిలో వైసిపి పాలనపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అభివృద్ధి రివర్స్లో వెళుతోందని చెప్తున్నారు. వైసిపి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం వైసిపి స్వ లాభం కోసం, సొంతవాళ్లకు పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పనుల్లో రివర్స్ టెండరింగ్ కు ఆలోచన చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు.
వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ నోటీసులపై స్పందించిన మంత్రి బొత్సా ... ఏమన్నారంటే
విజయసాయి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత మాణిక్యాల రావు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడిన ఆయన వైసీపీ నేత విజయసాయి రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు చెప్పే తాము అన్నీ చేస్తున్నామని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు .రివర్స్ టెండరింగ్ కు వెళ్ళమని, వరదల సమయంలో జెరూసలెం వెళ్లాలని, మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్లతో ఫోటోలు వీడియోలు తీయాలని ప్రధాని మోదీ, అమిత్షా చెపితే చేశారా అని వైసీపీ నేత విజయసాయిరెడ్డిని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కు వెళ్లవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేయడాన్ని గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా అనాలోచిత నిర్ణయం తీసుకొని రివర్స్ టెండరింగ్ కి వెళ్ళింది వైసిపి సర్కార్ అని ఆయన పేర్కొన్నారు.
తిరుమలలో అన్యమత ప్రచారంపై సీరియస్ అయిన మాణిక్యాలరావు
అనాలోచితంగా పోలవరం ప్రాజెక్ట్పై రివర్స్ టెండరింగుకు వెళ్లడం వల్లే హైకోర్టులో చుక్కెదురైందన్నారు. హైకోర్టు వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని మాణిక్యాల రావు ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం అన్నారు మాణిక్యాలరావు. మత రాజకీయాలు చేస్తుందని, ఒక మతానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు మాణిక్యాలరావు. తిరుపతి, తిరుమల మధ్య నడిచే బస్సుల్లో టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర ప్రకటనలు ఉండడం అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతమైతే, తిరుమల పవిత్రతకు భంగం కలిగితే.. పోరాటానికి సైతం బీజేపీ వెనకాడదని ఆయన తేల్చి చెప్పారు.
జగన్ సర్కార్ పంధా మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
ఇప్పటికే బిజెపి నేతలు అధికార వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం వ్యవహారంలో బిజెపి మరింత సీరియస్ గా ఉంది. నిన్నటికి నిన్న తిరుపతిలో ఆందోళన చేసిన బిజెపి, తిరుమలలో అన్య మత ప్రచారం పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుందని, జగన్ సర్కార్ తన పంథా మార్చుకోవాలని పదేపదే హెచ్చరిస్తోంది బిజెపి.