సుప్రీంకోర్టుపై మాకు నమ్మకముంది.. అదే జరుగుతుంది
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చొడుతున్నారని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. గతంలో రాజధాని అమరావతి అని చెప్పినప్పుడు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. రాజధానిని నిర్మించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్ జగన్ పై, ఆయన పార్టీపై విమర్శలు గుప్పించారు.
మూడు రాజధానులపై హైకోర్టు తీర్పునిచ్చి ఆరునెలలు దాటిపోయిందని, ఆ విషయాన్ని ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడమేంటని సత్యకుమార్ నిలదీశారు. నమ్మకం లేకపోవడంవల్లే ఇన్ని రోజులు ఆగారా? అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు నమ్మకముందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన గురించి రోడ్లపై ప్రజలు వైసీపీ నేతలను నిలదీస్తున్నారన్నారు.
మూడు భవనాలు కట్టలేని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పినవన్నీ అబ్దాలేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. మూడు రాజధానులంటే ఒక రాజకీయ క్రీడగానే ప్రభుత్వం చూస్తోందని, మూడు రాజధానుల పేరుతో ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయడం లేదన్నారు. కేంద్రం జోక్యం చేసుకునే అంశం కాకపోయినా గత చట్టాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. రైతులకు హామీ ఇచ్చి మాట తప్పారని, ఇప్పుడు వారు రోడ్డెక్కారని, వారికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.