త్రాగునీరు కంటే విద్యుత్ ముఖ్యమా కేసీఆర్ ? అధికారులా.. టీఆర్ఎస్ నాయకులా ? ఏపీ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి
జల వివాదాల పరిష్కారం కోసం నిన్న హైదరాబాద్ లోని జలసౌధలో చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తరపున ఇరిగేషన్ అధికారులు పాల్గొని ఎవరి వాదన వారు బలంగా వినిపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నిన్న వాడివేడిగా సాగింది. అయితే ఈ సమావేశంలో జరిగిన రగడ, తెలంగాణా అధికారుల తీరుపై ఏపీ రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
నిన్న కేఆర్ఎంబీ మీటింగ్ నుండి తెలంగాణా వాకౌట్ .. కారణం ఇదే
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులో చేస్తున్న జల విద్యుత్ ఉత్పత్తి పై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం లేకుండానే తెలంగాణ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దానిని నిలుపుదల చేయాలని వాదించింది. తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి వల్ల చాలా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని, ఇక రాయలసీమ సాగునీటి అవసరాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీరే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ వాదించింది. ఈ క్రమంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ వాదనతో ఏకీభవించి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణకు ఆదేశించింది. అంతేకాదు గతంలో ఉన్నట్లుగానే తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66 శాతం నీటి పంపకాలను చేసింది. ఇక దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుండి వాకౌట్ చేశారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా తెలంగాణా ఇరిగేషన్ అధికారుల తీరు : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
ఇక తెలంగాణా అధికారుల తీరుపై ఏపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి బాధ్యతారహితంగా ఉందని వ్యాఖ్యానించారు. కృష్ణ గోదావరి నది యాజమాన్య బోర్డు ఉమ్మడి సమావేశంలో తెలంగాణ రాష్ట్రం వినిపించిన వాదనలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభ్యంతరాలను తెలియజేశారు. తెలంగాణ అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు అని, వారు తమ బాధ్యతను మరిచి, టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించిన సమావేశంలో మాట్లాడటం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.
కావాలని వివాదం చెయ్యటానికే సాధ్యం కాని డిమాండ్లు పెట్టిన తెలంగాణా
ఇప్పటివరకు తెలంగాణకు ఉన్న నీటి వాటా కాకుండా, అదనంగా నీరు కావాలని అడగడం, కావాలని వివాదం చేయడమేనని పేర్కొన్నారు. 50:50 చొప్పున నదీ జలాలను పంపిణీ చేయాలని అడగడం ఎలా సమంజసం అవుతుందో చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే 100 టీఎంసీల కంటే ఎక్కువ నీరు సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరినట్టు వృధా చేసిన జలాలను తెలంగాణ నీటి వాటాలో జమ చేయాలని, దానిని ఆంధ్ర ప్రదేశ్ నీటి వాటాగా లెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయడం గొంతెమ్మ కోరిక లాంటిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణా కారణంగానే నీరు వృధా అయ్యిందని పేర్కొన్నారు.
ఏపీ త్రాగునీరు కంటే మీకు విద్యుత్ ముఖ్యమా కేసీఆర్ గారు
అంతేకాదు ఏపీ ప్రజలు తాగునీరు, సాగునీరు కంటే, మీకు విద్యుత్ ముఖ్యమా కేసీఆర్ గారు అంటూ కెసిఆర్ ను నిలదీశారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ప్రవర్తిస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న డిమాండ్లు ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. క్యారీ ఓవర్ వాటర్ స్టోరేజ్ కు ప్రత్యేక అకౌంట్ పెట్టాలని తెలంగాణ డిమాండ్ చేయడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించారు. పక్క రాష్ట్రం ఏమైపోతే ఏంటి, మేము బాగుండాలి అన్న చందంగా సీఎం కేసీఆర్ తీరు ఉందని, నిన్న అధికారుల ప్రవర్తన విస్మయానికి గురి చేసిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.