"బాబు ఏపికి, లోకేష్ తెలంగాణకు సిఎంలు కావాలని విభజన కుట్ర"
విజయవాడ/ ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి, బిజెపికి మధ్య సమరం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
విభజన హామీలపై గొంతు పెంచి మాట్లాడిన టిడిపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయవాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్, ఒంగోలులో మరో ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆ మాటలు అపితే చాలా మంచిది
యుద్ధానికి దిగుతాం, భిక్షం వేస్తున్నారా అనే మాటలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపితే మంచిదని బిజెపి నాయకులు అన్నారు. మిత్రపక్షంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరగదని, ప్రతిపక్షాలకే మేలు జరుగుతుందని వారన్నారు. యుద్ధానికి సిద్ధమంటున్నారు, మాకు చేత కాదా, మేం ప్రజల్లోకి వెళ్లలేమా అి అని శ్యాంకిశోర్ తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కున్నాం
టిడిపి యుద్ధం ప్రకటిస్తే తాము కూడా సిద్దమేనని శ్యాంకిశోర్ అన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో ప్రజల నుంచి ఇంతకన్నా ఎక్కువ ఒత్తిళ్లను ఎదుర్కున్నామని అన్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరిస్తోందని ఇన్నాళ్లు చెప్పిన టిడిపి ఇప్పుడు ఎందుకు బిజెపిని, ప్రధాని మోడీని నిందిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
వైసిపితో కలవొద్దని టిడిపి అంటుందా..
విభజన చట్టంలోని పలు సమస్యలను కేంద్రం పరిష్కరించిందని శ్యాంకిశోర్ అన్నారు. పోలవరానికి వేల కోట్ల రూపాయలు ఇస్తోందని చెప్పారు. వైసిపిలాటి పార్టీలతో కలవడం సరి కాదని పార్లమెంటులో టిడిపి ఎంపీలు చెబుతారని, ఇక్కడ కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు ధర్నా చేస్తే వారితో కలిసిన వైసిపితో టిడిపి జట్టు కడుతుందని కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా అని అడిగారు. ఇదేనా మిత్ర ధర్మం, అత్వావలోకనం చేసుకోవాలని ఆయన టిడిపికి సలహా ఇచ్చారు.
నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారు...
గత నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ ఏనాడైనా మిత్రధర్మం పాటించిందా అని సురేష్ రెడ్డి అడిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతాంగంలో, నిరుద్యోగుల్లో, కులాల మధ్య చిచ్చువల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిజెపి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు.
వారే టికెట్లు తెచ్చుకున్నారు...
కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడినవారు టిడిపి టికెట్లు తెచ్చుకుని ఆ పార్టీనే కబ్జా చేసి పార్లమెంటులో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. గల్లా జయదేవ్ అవినీతిపై సిబిఐ కేసులు ఉండడం వాస్తవం కాదా అని అడిగారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే ఆంధ్రకు రావాల్సిన భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్లాడని సురేష్ రెడ్డి అన్నారు. విభజన సమయంలో పెద్ద కుట్ర జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణకు నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రులు కావాలనే ఉద్దేశంతోనే విభజన చేశారని ఆయన ఆరోపించారు.