టీడీపీతో పొత్తు పై బీజేపీ బిగ్ ట్విస్ట్ - మారుతున్న లెక్కలు..!?
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ తరువాత ఇక ఎన్డీఏలోకి టీడీపీ చేరిక లాంఛనంగా భావించారు. 2014 తరహాలో మూడు పార్టీలు తిరిగి పోటీ చేస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. వచ్చే వారం పొత్తు పైన ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే టీడీపీతో పొత్తు పైన బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
పొత్తుల లెక్కలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో మాజీ మిత్రుడును ఎన్డీఏలోకి తీసుకోవాలని నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశంలోనూ పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపించాయి. కానీ, ఇప్పటి వరకు పొత్తు పైన రెండు పార్టీల నుంచి అధికారిక స్పష్టత లేదు. ఈ సమయంలోనే సీట్ల లెక్కల పైన చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. టీడీపీ, జనసేన అధినేతలు వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతారని..అక్కడే మూడు పార్టీల నుంచి పొత్తు ప్రకటన ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే, ఈ సమయంలో బీజేపీ నుంచి టీడీపీకి అందిన ప్రతిపాదనలు ఆసక్తి కరంగా మారాయి.

కొత్త సమీకరణాలు
బీజేపీ ఏపీలో 10 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబు 4 -6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కానీ, అనూహ్యంగా టీడీపీకి బలమైన నియోజకవర్గాలను కోరుతుండటంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీకి పట్టు ఉన్న విజయవాడ, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం స్థానాలను బీజేపీ కోరుతోంది. టీడీపీ నుంచి బీజేపీకి రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం ఇచ్చారు. అయితే, బీజేపీ మాత్రం 8 స్థానాలకు తగ్గేది లేదని చెబుతున్నట్లు సమాచానం. అదే విధంగా అసెంబ్లీ స్థానాలు పది వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా కాగా, బీజేపీ మాత్రం 15 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. ఇదే అంశం పైన తాజాగా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం
పొత్తు పైన బీజేపీ నుంచి సానుకూల ప్రకటన వస్తే ఆ తరువాత సీట్ల సర్దుబాటులో పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అటు సీఎం జగన్ తోనూ బీజేపీ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారనే సమాచారంతో ఈ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత ఆలస్యం చేయకుండా బీజేపీతో పొత్తు పైన స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ముందు పొత్తు ఖాయం చేయాలని, తరువాత సీట్ల గురించి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు. బీజేపీ ముందు సీట్ల అంశం పైన స్పష్టత ఇస్తే పొత్తు గురించి తుది ప్రకటన చేద్దామని చెబుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, వచ్చే వారం టీడీపీ-బీజేపీ పొత్తు పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications