నేనే గనుక సీఎం అయితే!,రాజీనామా చేయించి ఎన్నికలకు: బాబుకు విష్ణుకుమార్ కౌంటర్!
పురంధేశ్వరి లేఖ తర్వాత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి బీజేపీ నేతలు సైతం టీడీపీని విమర్శించడానికి గొంతు కలుపుతున్నారు.
విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీకీ మిత్రపక్షం బీజేపీ నుంచి సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి ఏకంగా దీనిపై ప్రధానమంత్రికి లేఖ రాయడంతో టీడీపీలో అలజడి రేగింది.
పురంధేశ్వరి లేఖ తర్వాత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి బీజేపీ నేతలు సైతం టీడీపీని విమర్శించడానికి గొంతు కలుపుతున్నారు. ముందునుంచి టీడీపీని విమర్శించడంలో ముందుండే విష్ణుకుమార్ రాజు.. తాజా మంత్రివర్గ విస్తరణపై తనదైన శైలిలో స్పందించారు.
తానే గనుక సీఎం అయి ఉంటే, వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించేవాడిని విష్ణుకుమార్ రాజు అన్నారు. అలా చేస్తేనే ఫిరాయింపు ఎమ్మెల్యేల గౌరవం పెరుగుతుందని తెలిపారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు.
ఫిరాయింపు పద్దతిని విష్ణుకుమార్ రాజు తీవ్రంగా తప్పుపట్టారు. అలా చేయడంలో అర్థం లేదని, మంచి పద్దతి కాదని సూచించారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కేటాయించడం సరైన చర్య కాదని, ఇది సాంప్రదాయానికి విరుద్దమని అన్నారు. ఇక మోడీకి పురంధేశ్వరి లేఖ రాయడం గురించి ప్రస్తావిస్తూ.. అది ఆమె వ్యక్తిగత విషయమన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా తాను పురంధేశ్వరితో ఏకీభవిస్తానని, అయితే పార్టీ నిర్ణయానికి దీనికి సంబంధం లేదని వివరించారు.