వైసీపీ దిగజారుడు రాజకీయాలు: పవన్ కళ్యాణ్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
అమరావతి: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఓ వైపు వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరికొంత మంది నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. తాజాగా, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదమనే అన్నారు.

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు మాధవ్. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ విమర్శించారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయన్నారు. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతామని అన్నారు.
పాలనను, ప్రభుత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రయివేటీకరించిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నుంచి 30 మిలియన్ మెట్రిక్ టన్నుల సాధనే ధ్యేయంగా ఉన్నామన్నారు. ఉద్యోగుల అభ్యంతరాలను తాము గౌరవిస్తాం. వారిపట్ల తమకు సానుభూతి వుంది. వారి ప్రయోజనాలకు భంగం కలుగవు. రాజకీయపార్టీలే తమ స్వార్ధం కోసం ఉక్కు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ పక్షాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరటామంటే అది బూతు. జనసేన శ్రమదానం చేసి రోడ్లు వేస్తామని చెప్పినా ప్రభుత్వంలో చలనంలేదు. సారాయి, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ లను నుంచి దృష్టి మళ్లించేందుకే పవన్ కళ్యాణ్తో వివాదం తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ శ్రమదానంపై ఉత్కంఠ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్.. రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్కు పవన్కు మధ్య తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది.
కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్కు బహిరంగ సభను మార్చినట్టు చెబుతున్నారు. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమధానం చేస్తారని ప్రకటించారు జనసేన నేతలు. అయితే వేదికను మార్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు జనసేన నేతలు.
అయితే, పోలీసులు మాత్రం పవన్ కళ్యాణ్ సభకు కరోనావైరస్ సాకును చూపిస్తున్నారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం విశాలంగా ఉండాలంటున్నారు. ఇరుకు ప్రాంతంలో సభ నిర్వహిస్తే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేంద్రం నింబధనలతో పాటు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్డర్స్ కూడా అమలులో ఉన్నాయని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సభా వేదికను ఎంచుకోవలంటున్నారు. ఇప్పటికీ తాము జనసేన నేతలతో టచ్లో ఉన్నామని, తాము అడిగిన క్లారిఫికేషన్స్ ఇస్తే సభకు అనుమతులు ఇస్తామంటున్నారు. కానీ, జనసేన నేతలు మాత్రం పోలీసులు కావాలనే సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకున్నా సభను నిర్వహించి తీరుతామని జనసేన నేతలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ శ్రమదానం, సభ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications