బాబు వల్లే కర్ణాటకలో ఓట్లు పెరిగాయా, రమణ దీక్షితులు కలిస్తే తప్పేమిటి?: సోము వీర్రాజు
అమరావతి: చంద్రబాబునాయుడు ప్రభావం ఉంటే కర్ణాటకలో బిజెపికి 20 నుండి 35 శాతానికి ఓట్లు ఎందుకు పెరిగాయని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపి నేతలను ప్రశ్నించారు. పవన్, జగన్ ను మేం నడిపిస్తోంటే మీరు ఎవరిని నడిపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారంనాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు.కర్ణాటకలో యడ్యూరప్ప రాజీనామా చేయడం జెడిఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేయడంపై బాబు చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ప్రస్తావించారు.
బిజెపితో టిడిపి పొత్తును తెగతెంపులు చేసుకొన్న తర్వాత రెండు పార్టీల మధ్య విమర్శల యుద్దం సాగుతూనే ఉంది. తాజాగా మరోసారి సోము వీర్రాజు బాబుపై విమర్శలు ఎక్కు పెట్టారు.
పవన్, జగన్ ను మేం నడిపిస్తే వీరేం చేస్తున్నారు
ఏపీ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు బిజెపి చెప్పినట్టు నడుస్తున్నారని టిడిపి నేతలు ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై సోము వీర్రాజు ఘాటుగానే సమాధానమిచ్చారు. జగన్, పవన్ లను మేం నడుపుతోంటే రాష్ట్రంలో మీరు ఎవరిని నడుపుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలపై వీర్రాజు మండిపడ్డారు.
బాబు దెబ్బ వల్ల ఓట్లు పెరిగాయా?
కర్ణాటక రాష్ట్రంలో చంద్రబాబునాయుడు దెబ్బ వల్లే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చిందని టిడిపి నేతలు చెబుతున్నారని వీర్రాజు గుర్తు చేశారు. బాబు దెబ్బ వల్లే కర్ణాటక రాష్ట్రంలో బిజెపి పతనావస్థకు చేరుకొందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో 20 నుండి 35 శాతానికి తమ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. బాబు దెబ్బ వల్లే ఓటు బ్యాంక్ పెరిగిందా అని ఆయన ప్రశ్నించారు.
రమణ దీక్షితులు అమిత్షా ను కలిస్తే తప్పా
టిటిడి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిస్తే తప్పేమిటని ఆయన బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. రమణ దీక్షితులు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. టిటిడిలో జరుగుతున్న వ్యవహరాలను కేంద్ర మంత్రి దృష్టికి రమణదీక్షితులు తీసుకెళ్ళారని ఆయన చెప్పారు.
ఆ సేవలను ఎవరికి అమ్ముకొన్నారు
తిరుపతిలో ఎల్1. ఎల్2 సేవలను ఎవరికి అమ్ముకొన్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. టిటిడిలో పాలన ఎలా సాగుతోందో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఎల్1, ఎల్ 2 సేవలను ఎవరికి అమ్ముకొన్నారని వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు పాలనను గాలికి వదిలేశారని ఆయన విమర్శలు గుప్పించారు.