APలో పొత్తుల దిశగా పయనిస్తోన్న మోడీ-షా?
భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 2024 సార్వత్రిక ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పటివరకు ఏ కూటములు వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.మోడీ-షా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ముందున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) కూడా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మూడోసారి దెబ్బతింది. ఆ సెంటిమెంట్ ను పునరావృతం కానీయకూడదు అనే పట్టుదలను మోడీ-షా ప్రదర్శిస్తున్నారు.

తగ్గేలోటును దక్షిణాది నుంచి పూడ్చుకోవాలని..
దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ బలం 303. గత ఎన్నికల సందర్భంగా 55.80 ఓట్ల శాతాన్ని బీజేపీ సాధించింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చే సరికి తమకు 144 నియోజకవర్గాలు తగ్గుతాయని ఆ పార్టీ అంచనా వేసింది. తగ్గే స్థానాల సంఖ్య ఎన్నికల సమయానికి ఇంకా పెరిగినా అవి 50 నుంచి 60 వరకు ఉండొచ్చని అంచనా. దీంతో మొత్తం కలిపి దాదాపు 200 సీట్ల లోటు కనపడుతోంది. తగ్గేవాటిని ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

రాజకీయాల్లో అవసరాల కోసమే మిత్రత్వం!!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఎవరి అవసరాల కోసం వారు పొత్తులు పెట్టుకుంటారని, అవసరం తీరిపోయిన తర్వాత ఆ పొత్తులు పటాపంచలవుతాయనేది నిత్యం మనం చూస్తున్నదే. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీచేశాయి. అధికారాన్ని దక్కించుకున్నాయి. 2019 ఎన్నికల సమయానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదించి ఎన్నికలకు వెళ్లడంతో తెలుగుదేశం చావుదెబ్బ తింది. అటువంటి పరిస్థితిని ఈసారి పునరావృతం కానివ్వకూడదని, గతంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, అవసరమైతే తాను మరింత తగ్గడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు.

కేంద్రం అండ అవసరమని గుర్తించిన చంద్రబాబు!
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవాలంటే కేంద్రం అండ తప్పనిసరి అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా తెలంగాణలో తనకున్న బలాన్ని చాటుతున్నారు. ఆ బలాన్ని ఓట్ల రూపంలో బీజేపీవైపు బదిలీచేసి ఏపీలో అండగా నిలబడమని కోరుకుందామనుకుంటున్నారు. ఏపీలో బీజేపీకి కనీసం ఒకశాతం ఓటుబ్యాంకు కూడా లేదు. మోడీ-షా లాంటి కాకలుతీరిన యోధులున్నప్పటికీ ఏపీలో ఆ పార్టీ బలాన్ని ఏమాత్రం పెంచలేకపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని 10 లోక్ సభ స్థానాలు సాధించాలనే యోచనలో బీజేపీ పెద్దలున్నారని సమాచారం. తెలుగుదేశం, జనసేన రానున్న ఎన్నికల్లో పొత్తుతో వెళ్లడం ఖాయమైంది. బీజేపీ కోసం ఈ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

ఫలిస్తున్న ప్రయత్నాలు?
బీజేపీ అగ్రనేతల మనసు మార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలించబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల మనసు కూడా నెమ్మదిగా మారుతోంది. రానున్న ఎన్నికల్లో ఉత్తర భారతంలో దెబ్బతింటామనే ఆందోళన వారిలో నెలకొంది. ఏపీలో టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడమే ఉత్తమమని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారని తెలిసింది. 8న కర్నూలులో అమిత్ షా పర్యటన ముగిసిన తర్వాత తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో బహిరంగసభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.












Click it and Unblock the Notifications