ఏపీ ప్రభుత్వం పై బీజేపీ కుట్ర - కమలం నేత చెబుతుందేంటి..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంతో ఏపీ సీఎం జగన్ సన్నిహితంగా ఉంటున్నా..ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేసారని, ఇంత కంటే అన్యాయం ఉంటుందా అని పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీని పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నది చీప్ పబ్లిసిటీగా కొట్టి పారేసారు. పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని ఫైర్ అయ్యారు.
కట్టుకథలు, కాల్పనిక విషయాలు స్రుష్టించి KCR రాజకీయ సంచలనం కోసం ప్రయత్నిస్తున్నారుని జీవీఎల్ తీవ్రంగా స్పందించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్ కు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్ గా నియమించారా అంటూ నిలదీసారు. భారత రాష్ట్ర సమితి అని పెట్టాను కనుక అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలనే ప్రయత్నంగా అభివర్ణించారు. అందులో భాగంగా మీడియా కవరేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదుని జీవీఎల్ పేర్కొన్నారు. కీసీఆర్ వైసీపీనీ ఎమైనా నడిపిస్తున్నారా అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అంటూ నిలదీసారు. తెలంగాణలో జరిగిందే అవాస్తవమని ఫాం హౌస్ ఎపిసోడ్ , వీడియోల పైన జీవీఎల్ తేల్చి చెప్పారు. అదే విషయాన్ని తమ పార్టీ నాయకత్వం గట్టిగా చెప్పిందని వివరించారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే విశ్వసనీయతకు భంగం వాటిల్లడం ఖాయమని హెచ్చరించారు. కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని సూచించారు.
2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా మారతామని జీవీఎల్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలు వుంటాయని ధీమా వ్యక్తం చేసారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను ప్రోత్సహిస్తామని చెప్పారు. కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ తో పాటుగా కథ, నిర్మాణం అంతా ఆయనదేనని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.