జగన్కు ఆ విషయం తెలుసు, స్కాంలు చేయడానికేనా విశాఖ?: జీవీఎల్ ఘాటు విమర్శలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా.. పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.
జగన్ పాత క్యాసెట్టే వేస్తున్నారంటూ జీవీఎల్
అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ఆధారమైన బయటపెట్టారా? అని బీజేపీ ఎంపీ నిలదీశారు. మూడు రాజధానులు సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్కు తెలుసు.. అయినా మూడేళ్ల క్రితం వేసిన క్యాసెట్టే మళ్లీ వేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు.
స్కాంలు చేయడానికేనా విశాఖ రాజధాని?: జీవీఎల్
సీఎం జగన్ విశాఖ అభివృద్ధికి సహకరించకుండా రాజధాని అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. విశాఖపట్నంలో రాజధాని పెడతామన్నారు ఎందుకు? అక్కడ కొత్తగా ల్యాండ్ స్కాంలు చేయాలనా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధికి అనేక సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి, కానీ, అలా జరగట్లేదని అన్నారు.
వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తోనే నిజమైన అభివృద్ధి
నిజమైన అభివృద్ధి కావాలంటూ వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం ఎందుకు నత్తనడకన నడుస్తోందని ఏపీ సర్కారును నిలదీశారు ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. మరోవైపు, కేంద్రమంత్రి నారాయణస్వామి కూడా మరోసారి ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద ప్రకటనల ఫలితంగానే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కొనసాగడం లేదని కేంద్రమంత్రి అబ్బయ్య నారాయణస్వామి అన్నారు.
అమరావతిని అభివృద్ధిరి అడ్డుకోవద్దంటూ కేంద్రమంత్రి
ఒక ప్రభుత్వం చేసింది కాబట్టి.. మరో ప్రభుత్వం చేయకూడదనే మనస్తత్వం రాజకీయ పార్టీ నేతలకు ఉండకూడదని కేంద్రమంత్రి నారాయణస్వామి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావించే.. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తోందన్నారు. అమరావతి రాజధానికి చేరువగా జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిందని తెలిపారు. జాతీయ రహదారులు నిర్మాణమవుతున్నాయని, ఇంతవరకు దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసిందని వివరించారు. అమరావతి ప్రాంతంలో 40 నుంచి 80 శాతం వరకు పనులు జరిగాయని.. ఇప్పుడు వాటిని నిలిపివేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు కేంద్రమంత్రి నారాయణస్వామి.