జగన్ పై దాడి...పలు అనుమానాలకు తావిస్తోంది:జివిఎల్; మంత్రి జవహర్ ఇతర నేతలు ఏమన్నారంటే?
విజయవాడ:ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్పై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఖండించారు. సురక్షితంగా భావించే ఎయిర్పోర్టులో దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
జగన్ పై దాడి గురించి తెలిసిన వెంటనే ట్విట్టర్ లో తన స్పందన పోస్ట్ చేశారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. దాడిపై వెంటనే జ్యుడిషియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. జగన్ పై జరిగిన దాడి గురించి మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివికావని అన్నారు. అయితే జగన్ పై ఎయిర్పోర్టులో దాడి జరగడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్టులో పెన్నును కూడా చెక్ చేస్తారని...అలాంటిది కత్తి లోపలికి ఎలా వెళ్లిందని మంత్రి జవహర్ ప్రశ్నించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే ఎయిర్పోర్టులో...దాడి ఎందుకు జరిగిందో విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయని అన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్పోర్టులో ఈ దాడి జరగడం నిఘా వైఫల్యమేనని, ఈ దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడిని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఖండించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తాయన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ..."ఇటువంటి దాడులు దారుణం...ఇలాంటివాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి...కోళ్ల పందాలకు వాడే కత్తి పదును తీవ్రంగా ఉంటుంది...కుట్రపూరితంగా జరిగిందేమోనని అనుమానం కలుగుతోంది"...అని వ్యాఖ్యానించారు.