టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ ఛీఫ్ జేపీ నడ్డా-ఎంపీలకు శుభాకాంక్షలు...
బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇవాళ మరో శుభవార్త అందింది. పార్లమెంటులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. తాజాగా పోర్ట్ బ్లెయిర్ స్ధానిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన నడ్డా.. ఇవాళ పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలతో కాసేపు సంభాషించారు.
పార్లమెంటులో ఇవాళ టీడీపీ ఎంపీలు పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎంపీలు.. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు పంచారు. ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు.

టీడీపీ ఎంపీలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాజ్ పేయి, ఎన్ డి ఏ హయాంలో టీడీపీ-బీజేపీ అనుబంధాన్ని జెపి నడ్డాకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర వివరించారు. దీనిపై స్పందించిన నడ్డా.. టీడీపీతో స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసన్నారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తుపైనా ట్వీట్ చేసిన జేపీ నడ్డా.. టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల విజయంపైనా ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీతో బీజేపీ నేతలు సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొంతకాలంగా శాంతించారు. దీంతో ఇరు పార్టీల మధ్య బంధం మరోసారి చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications