తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి మోడీ-షా ప్లాన్
భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దల ప్రణాళిక వేరుగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కవల రాష్ట్రాలే అయినప్పటికీ భిన్నమైన రాజకీయ పోకడలు పోతుంటాయి. ఓటరుగా తీర్పునివ్వడంలో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య భిన్న వైరుధ్యం ఉంది. ఏపీ ప్రజలు చదువుకొని కులాలకు ప్రాధాన్యమిస్తుండగా, తెలంగాణ ప్రజలు చదువుకొని అభివృద్ధికి పట్టం కడతారు.
రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని..
రెండు రాష్ట్రాల్లోను పాగా వేయాలని భారతీయ జనతాపార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా వారు ఒకటే సూత్రాన్ని అమలు చేస్తారు. అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూనే ప్రతిపక్షంపై గురిపెడతారు. కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల కలిగే లాభాలన్నింటినీ క్రోడీకరించుకొని, వాటిని ఉపయోగించుకొని విపక్షాన్ని నిర్వీర్యం చేస్తారు. బలమైన నేతలుంటేనే పార్టీ విస్తరించగలుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మే బీజేపీ పెద్దలు విపక్షంలోని బలమైన నేతలను బీజేపీలోకి చేర్చుకుంటారు. ఇక్కడితో ఆ పార్టీ మొదటి అంకం పూర్తవుతుంది.
ముందుగా విపక్ష స్థానంలోకి చేరుకోవడం
విపక్షం నుంచి ఆ రాష్ట్రంలో అధికార పక్షానికి చేరుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉండటం ద్వారా ఉండే అనుకూలతలను ఉపయోగించుకుంటారు. ఇందులో వారికి తన, మన అనే భేదం ఉండదు. ఆసేతు హిమాచలం కమలం జెండాను రెపరెపలాడించాలన్నదే వారి ఉద్దేశం. అవసరమైతే అద్వానీ లాంటి నేతలను కూడా ఇంట్లో కూర్చోపెట్టగలరు. ఇలా ఆ పార్టీ మూడోస్థానం నుంచి రెండో స్థానానికి, అక్కడి నుంచి మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. టీడీపీని బలహీనపరిచి ఆ పార్టీ లోని నేతలను తమ పార్టీలోకి తీసుకోవడంద్వారా ముందుగా విపక్షస్థాయికి చేరుకుంటారు.
అన్నిటికీ రాజకీయమే కారణం
పవన్ కల్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటోంది బీజేపీ పార్టీ. కరోనావల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని జనసేనాని స్వయంగా ప్రకటించారు. పవన్ ను ఖాతరుచేయని బీజేపీ అకస్మాత్తుగా మోడీతో భేటీ అయ్యేలా చూడటం కూడా రాజకీయ కోణమే ఇమిడివుంది. టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీకి మైనస్ అవుతుంది.. అలాకాకుండా విడివిడిగా పోటీచేస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది. టీడీపీని నిర్వీర్యంచేసి ఆ స్థానంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి జనసేన వెళ్లి టీడీపీతో కలవడం ఇష్టంలేదు. అలా అని వైసీపీ మీద ప్రేమ ఉండదు. వారికి రాజకీయ అవసరాలే ముఖ్యం.
కాలమే సమాధానం చెప్పాలి
వ్యూహం మార్చుకుంటున్నానని ప్రకటించిన జనసేనాని వెళ్లి చంద్రబాబుతో కలిస్తే టీడీపీ బలహీనపడదు. అందుకే పవన్ కల్యాణ్ ను టీడీపీకి దూరంగా ఉంచే ప్రయత్నమే చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గత ఎన్నికల్లో తనవల్ల చీలిందని అంతర్గతంగా ఒప్పుకునే పవన్ ఈసారి అటువంటి పరిస్థితి రానివ్వనని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఒకవైపు బీజేపీ అవసరాలు.. మరోవైపు వైసీపీపై తన పోరాటం.. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయం తీసుకుంటారా? అనేది స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.