జనసేన రుణం తీర్చుకోని బీజేపీ ? పేరుకే పొత్తు ప్రకటనలు..!
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందా అంటే ఉందనీ, లేదా అంటే లేదని చెప్పాల్సిన పరిస్ధితి గత రెండేళ్లుగా నెలకొంది.2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య రెండోసారి చిగురించిన పొత్తు ఇప్పటికీ కొనసాగుతుందా అని బీజేపీని అడిగితే అవునంటోంది. కానీ జనసేనను అడిగితే మాత్రం త్వరలో అన్నీ తేలుతాయనే సమాధానం వచ్చేది. అలాంటిది తాజాగా ఒంగోలులో బీజేపీ నిర్వహించిన సర్పంచ్ ల ధర్నాలో జనసేన నేతలు పాల్గొని ఈ ప్రచారాలకు చెక్ పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం షరామామూలే అన్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో మా పొత్తు జనసేనతో మాత్రమేనని, మిగతా పార్టీలతో పొత్తు లేదని,కలుపుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పదే పదే చెప్తుంటారు. అలాంటిది పొత్తున్న జనసేనతో కలిసి పనిచేయడం లేదేమని అడిగితే సందర్భం రావాలిగా అని చెప్పి తప్పించుకుంటుంటారు. తాజాగా ఒంగోలులో తమ పార్టీ నిర్వహించిన ధర్నాలో జనసేన నేతలు హాజరు అయి సంఘీభావం తెలిపినా బీజేపీ మాత్రం ఆ ధర్నా వరకూ ప్రచారం చేసుకుని ఆ తర్వాత తిరిగి సైలెంట్ అయిపోయింది.

ఒంగోలులో బీజేపీ ధర్నాతో పోలిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేస్తున్న వారాహి యాత్రకు మంచి స్పందన ఉంది. అంతే కాదు పవన్ వారాహి యాత్ర దెబ్బకు అసలు విపక్షం టీడీపీ నేతలు చేస్తున్న యాత్రలు, పర్యటనలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. అలాంటిది పవన్ వారాహి యాత్రలో ఎక్కడా బీజేపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కనిపించడం లేదు. అలాగని తమ పార్టీ కార్యక్రమాలకు రావొద్దని జనసేన నుంచి అధికారికంగా కానీ అనధికారికంగా కానీ బీజేపీకి కూడా ఎలాంటి సందేశం కూడా వెళ్లలేదు. అయినా బీజేపీ నేతలు ఎక్కడా కనిపించకుండా మొహం చాటేస్తున్నారు.
దీంతో ఒంగోలు ధర్నాలో జనసేన పార్టీ నేతలు పాల్గొన్నా బీజేపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఉత్తరాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఎక్కడా కనిపించకపోవడంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎప్పుడు చూసినా జనసేనతోనే పొత్తని చెప్పుకుని తిరుగుతున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు పవన్ యాత్రకు మద్దతివ్వకుండా, నేరుగా పాల్గొనకుండా మొహం చాటేయడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications