టీడీపీతో బీజేపీ పొత్తు - ఢిల్లీ తాజా సంకేతాలు..!!
ఏపీలో పొత్తుల రాజకీయంలో కొత్త ట్విస్ట్. ఇప్పటికే పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ, జనసేన తమతో బీజేపీ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ఏపీలో యాక్టివ్ అవుతున్న వేళ బీజేపీ ఎన్నికల పొత్తుల పై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీలోని బీజేపీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఈ నెలలోనే పొత్తు పైన బీజేపీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్న వేళ...ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలు భిన్నంగా ఉన్నాయి.
పొత్తుల లెక్కలు : ఏపీలో 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. 2019 ఎన్నికల ముందు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఏపీలో టీడీపీతో జత కట్టింది. బీజేపీ తమ రెండు పార్టీలతో కలిసి రావాలని జనసేనాని పలు సందర్భాల్లో అభ్యర్దించారు. బీజేపీ ఏపీలో నేతల అభిప్రాయ సేకరణ చేసినా..ఇప్పటి వరకు పొత్తు పైన తమ వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 22 న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత రాజకీయంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా ఏపీలో పొత్తుల పైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. సీట్ల ఖరారు అంశంలోనూ బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన వేచి చూస్తున్నాయి.

బీజేపీ కొత్త వ్యూహాలు : అయితే, తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లటం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన అంశాన్ని పార్టీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు. ఏపీలో పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు పార్టీ ఎదుగుదల లేకుండా పోయిందనే అభిప్రాయం సీనియర్లు పార్టీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏపీ నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల పైన బీజేపీ పార్లమెంటరీ కమిటీ చర్చించి ప్రధాని మోదీకి నివేదిక ఇవ్వనుంది. ప్రధాని మోదీ ఏపీలో పొత్తుల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దుల ఆశావాహుల సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వీరికి ఏ మేర ప్రజా మద్దతు ఉందనే అంశం పైన సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.

పొత్తు ఉండేనా : దీని ద్వారా బీజేపీ ఇటు పొత్తు అంశం పెడింగ్ లో ఉంచుతూనే..అటు సొంతంగా పోటీ చేయటం పైనా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయటం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుంది.. పొత్తుతో వెళ్తే కలిగే ప్రయోజనం పైన కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పొత్తు పైనా టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో వెళ్లటం ద్వారా కొన్ని వర్గాల ఓటింగ్ దూరం అవుతుందనే ఆందోళన కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మద్దతు లేకపోతే ఎలక్షనీరింగ్ లో వైసీపీని ఎదుర్కోవటం కష్టమేనే వాదన మరి కొందరిది. దీంతో, బీజేపీ అధినాయకత్వం తుది నిర్ణయం ఎలా ఉంటుంది.. పొత్తు ఖరారైతే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications