నరేంద్రమోడీ రాజకీయమంటే ఇలాగే ఉంటుందమ్మా..!!
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ ఉన్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ జట్టు కట్టింది. ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. అప్పటి ఎన్నికల సమయంలో నరేంద్రమోడీని పవన్ కల్యాణ్ కలవడమే.. ఇప్పటివరకు కలవలేదు. సుదీర్ఘమైన 8 సంవత్సరాల కాలం తర్వాత ప్రత్యేకంగా అరగంట సమయం మోడీతే భేటీ అయ్యారు.
ఢిల్లీ వెళ్లినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు
విశాఖలోని ఐఎన్ఎస్ డేగలో కలుసుకుందాం రండి.. అంటూ ప్రధానమంత్రిగా పిలిచారు కాబట్టి మర్యాదగా ఉండదు అన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ వెళ్లి కలిశారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రిని కలవడానికి ఎన్నోసార్లు ఆయన ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లి అపాయింట్ మెంట్ ఇస్తారనే ఉద్దేశంతో ఎదురుచూసి ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వక వెనుదిరిగి వచ్చిన సందర్భాల్లు కోకొల్లలు. కలవడానికి స్వయంగా ఢిల్లీ వచ్చినా మిత్రపక్షాన్ని, ఆ పార్టీ అధినేతను గౌరవించలేని పార్టీ తరఫున ప్రధానమంత్రి 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు భేటీ అయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జనసేనాని నమ్మకం కోల్పోయిన బీజేపీ
మిత్రపక్షంగా ఉన్నాను కాబట్టి అడిగితే 10 నిముషాలు అపాయింట్ మెంట్ ఇస్తారు అన్న నమ్మకం జనసేనానిలో ఉండేది. కాలక్రమేణా ఆ నమ్మకం పోయింది. రోడ్ మ్యాప్ ఇవ్వకుండా అలాగే ఎదురు చూపులు మిగిలేలా చేస్తారని పవన్ కు అర్థమైంది. గతంలోనే రెండుసార్లు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తర్వాత జనసేన, బీజేపీ కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. ఎవరికి వారుగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మిత్రపక్షాన్ని గౌరవించాలి.. మర్యాదను ఇచ్చి పుచ్చుకోవాలనే మాట బీజేపీకి లేశమాత్రం కూడా కలగలేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.
రాజకీయ అవసరాలుంటే అలాగే ఉంటాయమ్మా
బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సమయంలో కూడా జనసేనానిని పట్టించుకున్నది లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టి ఎన్నికలకు వెళుతున్నారు అనే వార్త ఖాయమనుకుంటున్న సమయంలో మాత్రం పిలిపించి మాట్లాడారు. భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు కలవని ప్రధానమంత్రి ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే కేవలం వారి రాజకీయ అవసరాలకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీని కలిసిన తర్వాత కూడా అంతే..
మోడీని కలిసిన తర్వాత పవన్ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. గుంకలాంలో జగనన్న ఇళ్లను పరిశీలించారు. తన సహజశైలిలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మత్స్యకారులకు హాని కలిగించేదికానీ, అవినీతినికానీ తుదముట్టించాలని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని, జనసేనకు ఒక అవకాశం ఇస్తే మార్పు అంటే ఏమిటో చూపిస్తానన్నారు. బీజేపీ నేతలు తమపార్టీని, తమ అధినేతను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారంటూ జనసైనికులు ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వ్యూహం మార్చుకుంటున్నానని ప్రకటించిన జనసేనాని తన వ్యూహాన్ని బీజేపీతోపాటు టీడీపీపై కూడా అమలు పరుస్తున్నారేమో అనిపిస్తోంది.