సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్
రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదం, ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్లపట్టాల పథకం అమలుకు సంబంధించి వైసీపీ, బీజేపీ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. చంద్రబాబుకు చీకటి మిత్రుడు అంటూ కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేయగా.. బీజేపీ తరఫున ఏకంగా ఏపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ రంగంలోకి దిగారు. సాయిరెడ్డికి దిమ్మతిరిగే రీతిలో ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

అసలేమైందంటే..
టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన నేతలను ఉద్దేశించి వైసీపీ సాయిరెడ్డి.. ‘‘ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి'' అని వ్యాఖ్యానించారు. దీనికి స్థానిక బీజేపీ నేతలు గట్టిగానే సమాధానమిచ్చారు. అయినాసరే సాయిరెడ్డి మరోసారి బీజేపీ ఏపీ చీఫ్ కన్నాను టార్గెట్ చేస్తూ.. ‘‘ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?''అని ప్రశ్నలు గుప్పించారు.

ఇళ్ల పట్టాలపై మళ్లీ..
కన్నాను టార్గెట్ చేసే క్రమంలో సాయిరెడ్డి మరో అనూహ్య ఎత్తుగడ ఫాలో అయ్యారు. ఇళ్లపట్టాల విషయంలో టీడీపీ తీరును తప్పుపడుతూ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. ‘‘నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ' చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది''అని ట్విటర్ ఎద్దేవా చేశారు. పదేపదే తమను టార్గెట్ చేస్తుండటం ఏపీలో బీజేపీ ఎదుగుదలకు సంకేతమని కాషాయ నేతలు అన్నారు. ఇంతలోనే..

సాయిరెడ్డికి సునీల్ పంచ్..
కన్నా, ఇతర నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ సాయిరెడ్డి వరుస విమర్శలు చేస్తుండటంతో ఏపీ బీజేపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ రంగంలోకి దిగారు. ‘‘విజయసాయిరెడ్డి.. కేవలం పసుపు రంగునే కాదు...అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్ల ఫేడ్ అయిపోతున్న మీ పార్టీ రంగును కాపాడుకోండి..'' అని పంచ్ విసిరారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దేవధర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. బీజేపీ నేతల కామెంట్లను బట్టి.. రెబల్ ఎంపీపై లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో వైసీపీకి అనుకూలంగా నిర్ణయం రాదేమోననే వాదన కూడా వినిపిస్తోంది.

ఎంపీపై ముప్పేటదాడి..
బీజేపీపై అదే పనిగా విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై కాషాయనేతలు ముప్పేటదాడికి దిగారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వేదికలపైనుంచి వరుస కౌంటర్లిస్తున్నారు. ‘‘బీజేపీ విషయాలు పట్టించుకోవడం మానేసి మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరితే ఆరుద్రలు.. బీజేపీలో చేరితే మిడతలా? అయినా తినడం గురించి మీ కన్నా బాగా ఎవరికి తెలుసు''అని బీజేపీ నేత సత్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి.. ‘‘బీజేపీపై ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను దేశంలో చాలానే చూసింది''అని మండిపడ్డారు.

రామాలయానికి సుజనా భారీ విరాళం..
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచిన బీజేపీ.. ఆలయ నిర్మాణాలకు అండగా నిలబడింది. అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించబోయే ఆలయం తరహాలోనే అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ప్రకటించగా, ఆమేరకు జేఏసీ కూడా ఏర్పాటై జీవీఆర్ శాస్త్రిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. అమరావతిలో కట్టబోయే రామాలయానికి ఎంపీ సుజనా చౌదరి భారీ విరాళం ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అఖిల భారత హిందూ మహాసభ... అయోధ్య తరహాలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను. రామాలయం నిర్మాణం వల్ల మన రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుంది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా రూ.10,01,116 విరాళం ప్రకటిస్తున్నాను''అని సుజనా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications