పురందేశ్వరికి బీజేపీ మరో జలక్ - టీడీపీకి దగ్గరవుతున్నారా..!!
దగ్గుబాటి పురందేశ్వరి కి బీజేపీలో ప్రాధాన్యత తగ్గుతోందా. ఎన్టీఆర్ కుమార్తెగా నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా.. ఆ తరువాత బీజేపీలో చేరిన పురందేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇప్పుడు క్రమేణా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తి తో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీని కారణంగానే గతనెలలో ఒరిస్సా బాధ్యతలు, ఈ రోజు ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ పురందేశ్వరిని బిజేపి అగ్రనాయకత్వం తప్పించిందంటూ బీజేపీలో చర్చ జరుగుతోంది.
బీజేపీ అంచనాలు అందుకోలేక
పురందేశ్వరి సమర్దతను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించారు. పురందేశ్వరి అధ్యక్షతన "ఏపిలో విస్తృత చేరికల కమిటీ" ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయం లో పార్టీ ముఖ్య నాయకత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా.. బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించలేకపోతున్నారని చెబుతున్నారు.
పురందేశ్వరికి గౌరవం ఇచ్చినా.. పార్టీ అప్పగించిన చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదనేది కమలం సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. పార్టీ కీలక నేతలు పలుమార్లు చెప్పినా, ఒక్క సారి కూడా "విస్తృత చేరికల కమిటీ" సమావేశాన్ని నిర్వహించకపోవడం బిజేపి అగ్రనాయకత్వం ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
టీడీపీతో దగ్గరవుతున్నారంటూ ప్రచారం
పురందేశ్వరి ద్వారా పెద్ద ఎత్తున టిడిపి తో పాటుగా ముఖ్య నేతలు ఇతర పార్టీల నుంచి బిజేపి లో చేరికలు ఉంటయాని పార్టీ నాయకత్వం ఆశించింది. అయితే, పురందేశ్వరి ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదని బిజేపి ముఖ్య నేతలు అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతం కంటే భిన్నంగా టీడీపీ అధినాయకత్వంతో పురందేశ్వరి కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉంటుండటంతో.. టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలోనూ పార్టీలో చర్చ వినిపిస్తోంది.
అయితే, అవి కుటుంబం సంబంధాలే కానీ, రాజకీయాలతో సంబంధం లేదనేది దగ్గుబాటి వర్గీయులు చెబుతున్న విషయం. పురందేశ్వరి నెమ్మదిగా టి.డి.పి కి దగ్గరయ్యే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయంలో బిజేపి అగ్రనాయకత్వం ఉందనే వాదనను వారు ఖండిస్తున్నారు. దగ్గుబాటికి ఉన్న గుర్తింపుతో బీజేపీలోకి ఇతర పార్టీలు.. పలు రంగాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఉపకరిస్తుందని బీజేపీ నేతలు ఆశించారు.
పురందేశ్వరికి మరో కీలక పదవి దక్కనుందా
కానీ, ఏ మాత్రం అది జరగకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో పురందేశ్వరి క్రియా శీలకంగా లేని కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ నేతలే చెబుతున్నారు. అయితే, పార్టీలో పదువులు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెబుతున్నారు.
అయితే, పురందేశ్వరి సేవలు పార్టీ ఏ రకంగా వినియోగించుకోవాలో ఒక అంచనాకు వచ్చిందని, త్వరలోనే ఏపీ బీజేపీలో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా పురందేశ్వరి ప్రాధాన్యత ఇస్తారనేది పార్టీలో ముఖ్య నేతల అంచనా. దీంతో..ఇప్పుడు బీజేపీలో పురందేశ్వరి ప్రాధాన్యత..భవిష్యత్ రాజకీయ అడుగుల పైన రాజకీయంగా చర్చ కొనసాగుతోంది.