ఏపీ రాజకీయాల్లోకి పరిపూర్ణానంద ఎంట్రీ: మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో పాదయాత్ర.. !
Recommended Video
అమరావతి: శ్రీపీఠాధిపతి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకుడు పరిపూర్ణానంద స్వామి ఇక ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, హిందూ పరిరక్షణా చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తరువాత ఆయన ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని సమాచారం.
పాదయాత్రతో ఎంట్రీ..
సంక్రాంతి పండుగ తరువాత పరిపూర్ణానంద స్వామి పాదయాత్ర నిర్వహించబోతున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పాదయాత్రను చేపట్టనున్నారు. తిరుపతి నుంచి రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపట్టడానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైందవ సమాజాన్ని జాగృతం చేయడం, మత మార్పిళ్లను నిరోధించడం వంటి చర్యల్లో భాగంగా ఆయన ఈ పాదయాత్ర నిర్వహించబోతున్నారట.
జగన్ లక్ష్యంగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకునే ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మత మార్పిళ్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయంటూ ఇదివరకే పరిపూర్ణానంద ఒకట్రెండు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాననీ వెల్లడించారు.
బీజేపీతో సంబంధం లేకుండా..
ఏపీ రాజకీయాల్లోకి ఆయన బీజేపీతో కలిసి వెళ్తారా? లేక పీఠాధిపతులు, మఠాధిపతులను సమీకరించి, తన పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ సారథ్య బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం పరిపూర్ణానంద చేతుల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆశించిన స్థాయిలో ఆయన ప్రభావాన్ని చూపలేకపోయారనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఏపీలో ఆయన పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా రాజకీయాలకు అతీతంగా ఓ వేదికను ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.
ఎల్వీ తొలగింపు తరువాతే..
తిరుమల తిరుపతి దేవస్థానం సహా దేవాదాయ శాఖలో పనిచేసే అన్యమత ఉద్యోగులను తొలగించాలని ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనపై ముఖ్యమంత్రి అకస్మికంగా బదిలీ వేటు వేశారు. కొన్ని క్రైస్తవ మత సంస్థల పెద్దల ఒత్తిళ్లతోనే వైఎస్ జగన్ ఆయనను తొలగించినట్లు అప్పట్లో హిందూ ధార్మిక సంస్థలు ఆరోపించాయి. తాజాగా అదే అంశంపై పరిపూర్ణానంద స్వామి ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నారు.