2019 చిక్కులు, మైండ్ గేమ్!: ఆ విషయం తెలిసే పవన్పై బీజేపీ దాడి
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను బీజేపీ నేతలు దూరం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బయటకు చెప్పనప్పటికీ అదే దారిలో ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ తమతో కలిసి రాడని తెలిసే బీజేపీ మాటల దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో.. విభజన నేపథ్యంలో టిడిపి-బిజెపికి పవన్ మద్దతు పలికారు. మరో ఆప్షన్ లేకనే తాను ఆ కూటమికి మద్దతు పలికానని పవన్ ఇప్పటికే చెప్పారు. ఇటీవల ఆయన టిడిపి ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అతనిపై మాటల దాడి ప్రారంభించింది. మూడు రోజుల క్రితం బీజేపీ ఏపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. పవన్తో తాము జత కట్టలేదని, ఆయన తమ కూటమికి మద్దతిచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.
అయితే, బీజేపీ అలా మాట్లాడడానికి కారణం లేకపోలేదని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దానినే పవన్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హోదా ఇవ్వకుంటే బీజేపీకి పవన్ దూరం కావడం ఖాయం. ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వాన్ని కూడా పలు అంశాల పైన ఆయన ప్రశ్నిస్తున్నారు. మరో విషయం ఏమంటే పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఓ వైపు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పవన్ దూరం అవుతారు. రెండు వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ పార్టీలతో పవన్ కలిసి ఉంటారా లేదా అనే విషయం పక్కన పెడితే, కూటమిలోనే ఉంటే అప్పుడు జనసేనకు సీట్లు ఇవ్వవలసి ఉంటుంది.
ఇక, పవన్ కళ్యాణ్తో కలిసి ఉండేందుకు బీజేపీ ఆయన ముందు ఓ ఆప్షన్ పెట్టిందనే వాదనలు ఉన్నాయి. అదే పవన్ బీజేపీలో చేరడం. అంటే జనసేనను బీజేపీలో విలీనం చేయడం. దానికి కూడా పవన్ సిద్ధంగా లేరు.
2019 ఎన్నికల్లో టిడిపి - బిజెపిలు కలిసే పోటీ చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి వరకు టిడిపి - బిజెపి మధ్య హోదానే పెద్ద సమస్య అయింది. ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, టిడిపిలు విడిపోయే ప్రసక్తి లేదు.
వీటితో పాటు ఆయన మరో కూటమితో జతకట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ వైఫల్యాల వంటివి చూపుతూ పవన్.. వేరే కూటమితో జతకడితే బిజెపి - టిడిపికి నష్టం. ఈ విషయం పైన పూర్తి క్లారిటీ రావడం వల్లే బీజేపీ ఇటీవల ఆయన పైన మాటల యుద్ధానికి దిగుతోందని అంటున్నారు. అప్పటికప్పుడు కాకుండా ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ పైన బీజేపీ మైండ్ గేమ్తో ముందుకెళ్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన ఎవరితో జత కడతారనే విషయమై కూడా అప్పుడే లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఆయన దూరమని, ఇప్పటికే బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికారు. కాబట్టి వాటిని కూడా దూరం పెట్టి.. లెఫ్ట్ పార్టీలతో జత కట్టవచ్చునని చాలామంది అభిప్రాయపడుతున్నారు. లెఫ్ట్ నేతలు కూడా.. బీజేపీ, టీడీపీలను వదిలి, చిత్తశుద్ధితో పోరాడితే పవన్తో కలుస్తామని చెబుతున్నారు.