వైసీపీ కోటపై కాషాయ జెండా: వినకపోతే..: 2న తిరుపతిలో ముహూర్తం: ఢిల్లీ నుంచి పెద్దల రాక
తిరుపతి: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పర్యటనలతో బిజీగా ఉంటోన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటలనూ మొదలు పెట్టారు. సంక్షేమ పథకాల నిధులను ఆయన జనం మధ్యే విడుదల చేస్తోన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతోంది. బాదుడే బాదుడు కార్యక్రమంతో విడతల వారీగా జిల్లాల్లోనూ టూర్ చేస్తోంది.
చేతులారా ప్రధానమంత్రి పదవిని పోగొట్టుకుంటోన్నరా?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు దిగబోతోన్నారు. దసరా తరువాత ఈ టూర్ ప్రారంభం కానుంది. దీని కోసం కాన్వాయ్ను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కూడా ఇదే పంథాను అందిపుచ్చుకున్నారు. భారీ యాత్రను చేపట్టనున్నారు. యువ మోర్చా తరఫున దీనికి రూపకల్పన చేశారు. ఈ యాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న రాయలసీమ జిల్లాలను టార్గెట్గా చేసుకుంది బీజేపీ. యువ సంఘర్షణ యాత్ర పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కర్నూలు వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 2వ తేదీన తిరుపతిలో లాంఛనంగా ఈ సంఘర్షణ యాత్రను ప్రారంభించనుంది. బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య హాజరు కానున్నారు. ఆయనే దీన్ని ప్రారంభిస్తారు. ఆయనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కిందని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం దగా చేసిందని మండిపడుతోంది. నిరుద్యోగ యువత భవిష్యత్ను ఉద్దేశపూరకంగానే నాశనం చేస్తోందని విమర్శిస్తోంది. ఉద్యోగ నియామకాలను తక్షణమే అమలు చేయాలనేది బీజేవైఎం ప్రధాన డిమాండ్. ఇదే డిమాండ్తో ఇక తాము ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.
ప్రత్యేక హోదా పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. తమకు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ చాలంటూ 2017లో అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి జగన్ సర్కార్ మభ్యపెడుతోందని ఆరోపించారు.