ఏమిటీ బ్లేడ్ బ్యాచ్?: పోలీసులపై రాళ్ల దాడి, గాయపడిన ఎస్సై
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. దానవాయిపేట వీటీ కళాశాలలో పోలీసులపై బ్లేడ్ బ్యాచ్ రాళ్ల దాడికి దిగింది. దీంతో త్రీటౌన్ ఎస్సై సంపత్ స్వలంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్యాటరింగ్ కార్మికులు హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్లేడ్ గ్యాంగ్ ప్రతీకార చర్యకు పూనుకుంది.
దీంతో గత కొన్ని రోజలుగా దాదాపు 30 మంది బ్లేడ్ గ్యాంగ్ ఆటోలో తిరుగుతూ క్యాటరింగ్ కార్మికులపై దాడికి తెగబడుతూ వస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు దానవాయిపేట వీటీ కళాశాలలో ఉన్న బ్లేడ్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన బ్లేడ్ గ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై రాళ్లతో దాడి చేసింది.
దాడితో అప్రమత్తమైన పోలీసులు బ్లేడ్ బ్యాచ్లోని ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయికి అలవాటు పడిన ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆ ముఠానే బ్లేడ్ బ్యాచ్గా పేరు పొందింది.
ఆ బ్యాచ్ గోదావరి రైల్వే స్టేషన్ను అడ్డగా మార్చుకుంది. వీరు ప్రయాణికులను బ్లేడ్లతో గాయపరుస్తూ దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ ముఠాకు చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇద్దరిని హత్య చేసినవారిని చంపేస్తాంటూ హంగామా చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ బ్యాచ్పై పోలీసులు నిఘా పెట్టారు. దాంతో ఆ బ్యాచ్ తన మకాంను వీటి కళాశాల సమీపానికి మార్చుకుంది. ఈ విషయం తెలిసి ఎస్సై సంపత్ బుధవారంనాడు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.
రాళ్లతో దాడికి దిగడమే కాకుండా తమను పట్టుకుంటే చంపేస్తామని, లేదంటే చనిపోతామని బెదిరిస్తూ గ్యాంగ్ సభ్యులు తమను తాము కూడా గాయపరుచుకున్నారు. ఐదుగురిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.