దారుణం: మత్తు బిళ్లలు ఇచ్చి అంధ విద్యార్థినిపై అంధుడి అత్యాచారం
గుంటూరు: ఓ అంధ విద్యార్థిని ఓ అంధుడి కామానికి పనిముట్టు అయింది. ఓ యువతి ఆమె తల్లి కష్టంతో అంధుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. అదే సమయంలో సహ విద్యార్థి జాన్రత్నాన్ని సోదరుడిగా భావించింది. ఆ చనువుతోనే అతడు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మంటే నమ్మి అతని రూమ్కు వెళ్లి అత్యాచారానికి గురైంది.
మత్తుబిళ్లలిచ్చి పలుమార్లు ఈ ఘాతుకానికి పాల్పడడంతో ఆమెకు కూడా విషయం తెలియలేదు. అయితే రెండు నెలల అనంతరం అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళితే గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో నిర్ఘాంత పోయిన ఆమె తల్లితో విషయం చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని డాక్టర్లు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలిపారు. దీనితో ఒంగోలు త్రీటౌన్ పోలీసులు జాన్రత్నాన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జాన్ రత్నం మత్తు బిళ్లలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో విద్యార్థినిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.
సోమవారం జాన్ రత్నం తరపున ఆమెను పెళ్లి చేసుకోవడానికి కొందరు పెద్దలు రాజీ యత్నాలు చేశారు. దీనికి ఆమె పూర్తిగా నిరాకరించింది. అబార్షన్ చేయాల్సిందిగా డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంకు చెందిన తల్లి సక్రిబాయి ఆశా వర్కర్గా కారంపూడి పిహెచ్సిలో పని చేస్తోంది.
గత కొన్నాళ్లుగా జీతాలు లేక పస్తులుంటున్నామని, దీనికి తోడు వైద్యానికి రూ. 40 వేలకు పైగా అప్పులు చేశానని, ఈ విషయం వెలుగులోకి రావడంతో జీవితం శూన్యంగా కనిపిస్తోందని ఆమె జిజిహెచ్లో విలపిస్తోంది.