అనంతపురం జిల్లాలో పెను విషాదం: తెప్ప బోల్తా పడి.. 13 మంది మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా గుంతకల్లులో శుక్రవారం సాయంత్రం పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఎర్రతిమ్మరాజు చెరువు(వైటీ చెరువు) లో తెప్ప బోల్తా పడిన దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు.
గుంతకల్: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ రోజు సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఎర్రతిమ్మరాజు చెరువు(వైటీ చెరువు) గుండా తెప్ప వెళుతుండగా ఒక్కసారిగా అది బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో తెప్పలో మొత్తం 19 మంది ఉన్నారు. వారిలో 13 మంది నీటిలో మునిగి మృతి చెందగా, మిగతా వారంతా గల్లంతయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇంకా చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది గ్రామస్థుల సహాయంతో ఎనిమిది మృతదేహాలను బయటికి తీశారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మృతులు, గల్లైంతైన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 9 మంది ఉన్నట్లు గుర్తించారు. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడంతోనే తెప్ప తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
మరోవైపు ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఆయన జిల్లా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడారు. చెరువు వద్దనే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు...
అనంతపురం జిల్లాలోనే మరో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. హావళిగి గ్రామంలోని చెరువులో పడి తులసి, పూజ అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. తల్లి చెరువు వద్ద బట్టలు ఉతుకుతుండగా.. నీటిలోకి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయి, ఊపిరాడక మృతి చెందారు.